ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో ఆయన కేజే సిస్టమ్స్ విస్తరణ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సెంటర్ ఏర్పాటు వల్ల ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. వంద రోజుల్లో రాష్ట్రానికి మంచి మంచి కంపెనీలు రాబోతున్నట్టు చెప్పారు. చిన్న కంపెనీల ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్
మరోవైపు ఏపీలో అన్ని రంగాల్లో ఐటీ ఆధారిత విధానాలు అమలు చేస్తున్నారు. ఉద్యోగుల హాజరు కచ్చితంగా నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విధానాలు అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్ పద్ధతిని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయాల్సిందేనని పేర్కొంది. కొందరు ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదని, సమీక్షలకు హాజరు కావడం లేదని ఏపీ ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డిప్యూటీ సెక్రటరీలు ప్రతిరోజూ హాజరు వివరాలను నమోదు చేయాలని, ప్రతి నెల చివరిలో శాఖల కార్యదర్శులు, సీఎస్ కు అటెండెన్స్ రిపోర్ట్ పంపాలని ప్రభుత్వం ఆదేశించింది.
బయోమెట్రిక్ యంత్రాల్లో నమోదయ్యే హాజరు సర్వరుకు అనుసంధానమవుతుంది. అక్కడ ప్రతి ఉద్యోగి ఎన్ని గంటలకు వచ్చారు.. ఎన్నిగంటలకు వెళ్లారన్నది తెలిసిపోతుంది. ఇలా సమయపాలన, క్రమశిక్షణ కచ్చితత్వం కోసం సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు ఈ విధానం అమలు చేయనున్నారు.