ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రఖ్యాత సంస్థ డెల్ ముందుకొచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అమెరికా పర్యటనలో భాగంగా డెల్ కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ సత్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి లేదా రాష్ట్రంలో మరే ప్రాంతంలోనైనా డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
అమెరికాలో ఐటి సంస్థలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రులతోనూ చంద్రబాబు డల్లాస్లో భేటీ అయ్యారు. ఐటీ సేవల రంగంలో పేరొందిన ప్రవాస తెలుగువారు అమెరికాలో 28కి పైగా సంస్థలు నిర్వహిస్తున్నారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజు ప్రాతిపదికన కేటాయించిన స్థలాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమని వారు వెల్లడించారు. ప్రీమియర్, గ్లోబల్ ఔట్లుక్, టెక్ప్రోస్ సాఫ్ట్వేర్, ఆర్కస్ టెక్, శ్రీటెక్, మద్ది సాఫ్ట్, గురూస్ ఇన్ఫోటెక్, ఏఈ ఇన్ఫోటెక్, ఆక్టస్ తదితర కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. ఈ కంపెనీల రాకతో ప్రాథమిక దశలో విశాఖలో 310, అమరావతిలో 64 ఉద్యోగాల కల్పనకు వీలు కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ ఏపీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రవాస తెలుగువారందరినీ చంద్రబాబు అభినందించారు. గతంలో తన హయాంలో మూడో పారిశ్రామిక విప్లవాన్ని చూశానని, ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని... అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చంద్రబాబు చెప్పారు.