అమెజాన్లో ఫోన్ బుక్ చేస్తే రాయి వచ్చింది.. ఖాళీ బాక్స్ పంపారు అని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటాం. ఇకపై అలా చెప్పినా ఎవరూ నమ్మరేమో.. ఎందుకంటే ఇలాగే ఫోన్ బుక్ చేస్తే ఖాళీ బాక్సే పంపారంటూ ఓ 21 ఏళ్ల ఢిల్లీ కుర్రాడు అమెజాన్కు ఏకంగా 50 లక్షలకు టోపీ పెట్టేశాడు.
ఇదీ క్రైం కథ
ఢిల్లీకి చెందిన శివమ్ చోప్రా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. పెద్దగా నాలెడ్జి లేకపోవడంతో జాబ్ రాలేదు. దీంతో ఈజీ మనీ ఎలా అని ఆలోచించి అమెజాన్ను టార్గెట్ చేసుకున్నాడు. అమెజాన్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. డెలివరీ వచ్చాక వాటిని తీసుకుని, నాకు ఆ ఫోన్లు రాలేదు.. ఖాళీ బాక్స్లే పంపారని అమెజాన్ కు కంప్లయింట్ చేశాడు. తన మనీ తనకిమ్మని ప్రెజర్ చేశాడు. దీంతో అమెజాన్ అతని ఖాతాలో అమౌంట్ రిఫండ్ చేసేసింది. ఇక అక్కడి నుంచి యాపిల్, శాంసంగ్, వన్ప్లస్ కంపెనీల హై ఎండ్ ఫోన్లు ఆర్డర్ చేయడం, అవి వచ్చాక ఖాళీ బాక్సే వచ్చిందని కంప్లయింట్ ఇవ్వడం, మనీ రిఫండ్ తీసుకోవడం చేసేవాడు. ఈ ఫోన్లను ఓఎల్ ఎక్స్, క్వికర్ లాంటి సైట్లలోగానీ గఫార్ మార్కెట్ వంటి చోట్ల గానీ అమ్మేస్తున్నాడు. ఇలా రెండు నెలల్లో 166 ఫోన్లు ఆర్డర్ ఇచ్చి అవి రాలేదని మనీ రిఫండ్ తీసుకున్నాడు. ఈ మోసం విలువ మొత్తం 50 లక్షలు
దొంగ సిమ్లు, బోగస్ అడ్రస్లు
ఒకే అడ్రస్కు అన్ని ఫోన్లు ఎలా ఇచ్చారని డౌట్ వస్తుంది కదా.. అందుకే సచిన్ జైన్ అనే సెల్ఫోన్ షాప్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యాడు. అతనికి ఒక్కో సిమ్కు 150 రూపాయలిచ్చి 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు తీసుకున్నాడు. వాటితో తప్పుడు అడ్రస్లు ఇచ్చి అమెజాన్లో ఫోన్లు బుక్ చేసేవాడు. ఇలా తప్పుడు చిరునామాలతో రెండు నెలల్లో 166 ఫోన్లకు ఆర్డరిచ్చాడు. ఫోన్ను డెలివరీ చేసేందుకు వచ్చే బాయ్, ఆ అడ్రస్లో లేరని తెలుసుకుని కాల్ చేస్తే దగ్గరలోనే ఉన్నానని చెప్పి ఒకటి రెండు చోట్లకు తిప్పి ఆ డెలివరీ బాయ్ దగ్గర ఫోన్ తీసుకునేవాడు. ఫోన్ డెలివరీ అయిన కాసపటికే తనకు ఫోన్ రాలేదని, ఖాళీ బాక్స్ వచ్చిందని కంప్లయింట్ చేసేవాడు. తన డబ్బులు రిఫండ్ చేయాలని అమెజాన్ను కోరేవాడు. దీంతో అతని డబ్బులు అతనికి వచ్చేవి. ఇలాంటి కంప్లయింట్లన్నీ స్పెసిఫిక్గా ఢిల్లీలోని ఓ ఏరియా నుంచే వస్తుండడంతో అమెజాన్కు డౌట్ వచ్చింది. కంప్లయింట్ చేస్తే పోలీసులొచ్చి మొత్తం బయటికి లాగారు. శివం నుంచి 19 సెల్ ఫోన్లు, 12 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.మరో 10 లక్షల క్యాష్ వేరేచోట దాచినట్లు గుర్తించారు.