కంప్యూటర్ ప్రపంచాన్ని రోజుకో వైరస్ వణికిస్తోంది. తాజాగా వన్నాక్రై రామ్సన్వేర్ ప్రకంపనలు ఇంకా తగ్గకముందే మరో వైరస్ రంగంలోకి దిగివంది. ఇది కంప్యూటర్లకు వేగంగా పాకుతూ భయపెడుతోంది. ఆ వైరస్ పేరు ఫైర్బాల్. చైనాలో పుట్టిన ఈ మాల్వేర్ చాలా వేగంగా కంప్యూటర్లకు విస్తరిస్తుంది. ఇప్పటికే 250 మిలియన్ల కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడ్డాయి. ఇందులో భారత్కు చెందిన కంప్యూటర్లే ఎక్కువగా ఉండడం ఆందోళన
కలింగించే అంశం. భారత్లో ఇప్పటివరకు 25 మిలియన్ల పీసీలు ఫైర్బాల్ బారిన పడినట్లు సమాచారం. కంప్యూటర్లోని బ్రౌజర్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తద్వారా అన్ని ఫైల్స్కు వ్యాపించి టోటల్గా సిస్టమ్ మొత్తం కరెప్ట్ అయిపోయే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ యాడ్ రెవిన్యూ పెంచుకునేందుకు ఒక చైనా కంపెనీయే ఈ ఫైర్బాల్ను సృష్టించిందని ఇప్పుడు ఆ వైరస్ ప్రమాదకరంగా మారిందని వారు చెబుతున్నారు.
ఎవరున్నారు దీని వెనుక?
బీజింగ్కు చెందిన ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఈ ఫైర్బాల్ వైరస్ వెనుక ఉన్నట్లు సమాచారం. ఈ వైరస్ గూగుల్, యాహూల ద్వారా మన బ్రౌజర్కు వచ్చే ప్రమాదం ఉందని దీని వల్ల మీ కంప్యూటర్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ అది తమ సొంతం చేసుకుంటుందని వారు చెప్పారు. అంటే మన కంప్యూటర్లో ఉపయోగించే సైట్లకు వచ్చే వ్యూస్ని తమవైపు రీడైరెక్ట్ చేస్తుందని వారు చెబుతున్నారు. అంతేకాక ప్రైవేటు ఇన్ఫర్మేషన్ను కూడా ఇది కలెక్ట్ చేస్తుందని వారు చెప్పారు. అంటే మన కంప్యూటర్ మనకు తెలియకుండానే థర్డ్ పార్టీ కనుసన్నల్లోకి వెళిపోతుందన్నమటా. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి.
ఎవరికి ప్రమాదం ఉంది?
ఫైర్బాల్ వైరస్ వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుంది భారతే. మన దేశంలో 20 శాతం కార్పొరేట్ నెట్వర్క్స్ ఈ వైరస్ బారిన పడ్డాయి. అంతేకాదు ఇంకా గంట గంటకు తన శక్తిని పెంచుకుంటూపోతోందీ వైరస్. ఈ వైరస్ బారిన పడ్డ దేశాల్లో భారత్ (10.1 శాతం) ముందంజలో ఉండగా, బ్రెజిల్ (9.6 శాతం) తర్వాత స్థానంలో ఉంది. భారత్లో 25.3 మిలియన్ల కంప్యూటర్లకు, బ్రెజిల్లో 24.1 మిలియన్ల కంప్యూటర్లకు ఈ వైరస్ పాకినట్లు చెక్ పాయింట్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఈ వైరస్ సోకిన దేశాల్లో మెక్సికో (16.1 మిలియన్ల కంప్యూటర్లు) మూడో స్థానంలో ఉంది. అలెక్సాలో ర్యాంకింగ్స్లో ముందంజలో ఉన్న చాలా వెబ్సైట్లలో ఈ వైరస్ ఉండడం ఆందోళన కలిగించే అంశం.
ఈ వైరస్ ఏం చేస్తుందంటే..
ఈ వైరస్తో ప్రధాన సమస్య ఏంటంటే ఇది మన కంప్యూటర్ కార్యకలాపాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడం. అంటే మనం పూర్తిగా వేరే వాళ్ల చేతుల్లోకి వెళిపోతాం. ఇది ప్రమాదకర స్థితి. అంటే మనకు కంప్యూటర్ల సైట్లకు వచ్చే ట్రాఫిక్ను మనకు తెలియకుండానే థర్డ్పార్టీకి వెళ్లిపోతాయి. అంతేకాక మన సిస్టమ్లో ఎలాంటి కోడ్నైనా రన్ చేసే అవకాశం ఈ మాల్వేర్కు ఉంటుంది. ఈ మాల్వేర్ ఎప్పుడైనా పేలడానికి సిద్ధంగా ఉండే న్యూక్లియర్ బాంబ్ లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కంప్యూటర్లో ఇతర అప్లికేషన్లను కూడా ఫైర్బాల్ పని చేయకుండా చేస్తుందని.. యాంటీవైరస్లు కూడా దీని ముందు నిలవలేవని చెబుతున్నారు. ఈ వైరస్ మన కంప్యూటర్కు ఎఫెక్ట్ అయిందో లేదో చూడాలంటే మన కంప్యూటర్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ ఎక్స్టెన్షన్లను జాగ్రత్తగా చూడాలి. యాడ్వేర్ స్కానర్ను ఉపయోగించడం ద్వారా కూడా ఈ వైరస్ను రాకుండా నిరోధించొచ్చు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అన్ఇనిస్టాల్ చేయాలి.