పెట్యా ర్యాన్సమ్ వేర్... 150 దేశాల్లో లక్షలాది కంప్యూటర్లను నాశనం చేసేసింది. ఇంతకీ ఏంటీ ర్యాన్సమ్ వేర్ వైరస్.. ఇది ఎలా చొరబడుతుంది...? ఏం చేస్తుంది... ఎలా నాశనం చేస్తుందో చూద్దాం.
ర్యాన్సమ్ వేర్ అంటే..
కంప్యూటర్లను నాశనం చేసే మాల్వేర్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని మన సమాచారాన్ని దొంగిలిస్తాయి. ఇంకొన్ని తొలగించేస్తాయి(డిలీట్). మరికొన్ని అసలు కంప్యూటర్నే పనిచేయకుండా చేస్తాయి. అలా మన కంప్యూటర్ను మనం వాడలేకుండా చేయగలిగే మాల్వేర్లలో రాన్సమ్వేర్ చాలా ప్రమాదకరమైనది. ఇది మన నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంది. మన కంప్యూటర్ను ఆధీనంలోకి తీసుకుని అందులో మనల్ని ఏ పనీ చేయకుండా నిరోధించడంతో పాటు.. మళ్లీ ఎప్పటిలా పనిచేయాలంటే నిర్ణీత మొత్తం చెల్లించాలంటూ హ్యాకర్లు ఈ రాన్సమ్వేర్ల ద్వారా చొప్పించిన సందేశాలతో డిమాండ్ చేస్తుంటారు. ఇది కంప్యూటర్లను, సాఫ్ట్వేర్లను, యాప్లను పనిచేయకుండా ఆపేస్తుంది. రాన్సమ్వేర్ నుంచి వచ్చిన సందేశాన్ని మాత్రమే చూపిస్తుంటుంది. తాజా పెట్యా దాడి ఇలాంటిదే. క్రిప్టో కరెన్సీ(బిట్ కాయిన్) రూపంలో 300 డాలర్లు చెల్లిస్తేనే వైరస్ విముక్తం చేస్తామని సందేశాలు వస్తున్నాయి.
అటాక్ ఇలా..
అన్ని వైరస్ ల మాదిరిగానే రాన్సమ్వేర్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) వల్నరబుల్ గా ఉంటే ఆ కంప్యూటర్లలో చొరబడుతుంది. కొన్ని సందర్భాల్లో మరింత అధునాతనంగా చొప్పిస్తారు. ఉగ్రవాద సంస్థలు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్తో పనిచేసే కంప్యూటర్లును వాడితే, వాటిని హ్యాక్ చేసేందుకు అమెరికాకు చెందిన జాతీయ భద్రతాసంస్థ(ఎన్ఎస్ఏ) ఉపయోగించే సాఫ్ట్వేర్ను కూడా హ్యాకర్లు చేజిక్కించుకుని వాడుతున్నారు. ఇటీవల వానా క్రై అటాక్ లో ఇదే పనిచేశారు.
ర్యాన్సమ్ వేర్ బారినపడినట్లు గుర్తిస్తే వెంటనే తమ కంప్యూటర్లు, ల్యాప్టాప్లకు ఇంటర్నెట్ సౌకర్యం తొలగించాలి. బయాస్ క్లాక్ను సవరించాలి. దానివల్ల వైరస్ వ్యాప్తిని కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది.
ముందుజాగ్రత్తలు
* ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్నెట్ సెక్యూరిటీ(యాంటీ వైరస్) ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
* ఇతర ముఖ్యమైన సాఫ్ట్వేర్లను కూడా ఆప్డేట్ చేసుకోవాలి.
* వైరస్ల వ్యాప్తిలో ఈమెయిళ్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి అనుమానాస్పద మెయిళ్లను తెరవకూడదు. తెరిచినా అందులోని అటాచ్మెంట్లను అస్సలు క్లిక్ చేయొద్దు.
* మన కంప్యూటర్లలోని ముఖ్యమైన ప్రతి సమాచారాన్ని మరోచోట కూడా భద్రపరచాలి.(బ్యాకప్)
* క్లౌడ్ సేవలను ఉపయోగించుకుని సమాచారాన్ని పదిలపరుచుకోవడం వల్ల కూడా ఇలాంటి దాడుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.
రష్యా పనేనా...
పెట్యా అటాక్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపై ఉణ్నా కూడా ఎక్కువగా ఉక్రెయిన్ దెబ్బతింది. అందులోనూ అక్కడి ప్రభుత్వ వెబ్ సైట్ల దెబ్బతిన్నాయి. దీంతో ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యాను వేలెత్తి చూపుతోంది. అయితే.. రష్యా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.