బిట్కాయిన్... డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడిదో పెద్ద సంచనం. రోజు రోజుకీ తన విలువను పెంచుకుంటూ బిట్కాయిన్ మార్కెట్లో దూసుకెళ్లిపోతోంది. లైట్ కాయిన్ లాంటివి తనకు పోటీగా నిలుస్తున్నాయి బిట్కాయిన్ మాత్రం విలువ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఆన్లైన్ అంటేనే అదో మాయా ప్రపంచం. ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా మనం కళ్లు మూసి తెరిచేలోపు మోసానికి గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయిక్కడ. బిట్కాయిన్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు. తాజాగా బిట్కాయిన్ విషయంలోనూ ఒక స్కామ్ బయటపడింది. అదీ భారత్ వేదికగా! ఏంటి స్కామ్... ఏమిటా కథ చూద్దామా!
బిట్ కాయిన్స్ ఇస్తామని చెప్పి..
స్కామ్ల కాలం నడుస్తోందిప్పుడు. క్లిక్ల ద్వారా డబ్బులు సంపాదించడని కోట్లకు కోట్లు కొల్లగొట్టిన స్కామ్లు చాలా ఉన్నాయి. తాజాగా బిట్కాయిన్ కూడా అదే కోవలో చేరి పోయింది. మా వెబ్సైట్ ద్వారా బిట్కాయిన్ను తక్కువ ధరకు కొనుగోలు చేయండి.. అనే ప్రకటనలతో దిల్లీలో ఒక గ్యాంగ్ జనాలను ముంచేసింది. సోనేపట్కు చెందిన నరేంద్ర దహియా ఈ స్కామ్కు ఆద్యుడిగా పోలీసులు భావిస్తున్నారు. అతను మరో ఎనిమిది మందితో కలిసి కరెన్సీకాష్కాయిన్.కామ్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేశాడు. దీని ద్వారా బిట్కాయిన్స్ అమ్ముతామని ప్రచారం చేశాడు.
చైన్ మార్కెటింగ్ ద్వారా..
మోసం చేయడానికి అనువైంది చైన్ మార్కెటింగే.. క్రిప్టో కరెన్సీని మల్టీ లెవల్ మార్కెటింగ్కు అనుసంధానం చేసి ఎక్కువ లాభాలు గడించొచ్చని ఈ గ్యాంగ్ అందర్ని నమ్మించింది. దీని కోసం ఒక కస్టమర్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను చైన్గా ఏర్పాటు చేసుకోవాలని ఎంత ఎక్కువమంది గ్రూప్లో ఉంటే అంతగా లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. దీంతో చాలామంది ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు. తమకు వచ్చే లాభాల్లో 10 శాతాన్ని కస్టమర్లు చేరిన ఐదేళ్లలో వారికి చెల్లిస్తామని కూడా వాళ్లు చెప్పారు. కాష్ కాయిన్ పేరుతో వాళ్లు తమ లావాదేవీలను కొనసాగించారు. ఇప్పటికే ఈ గ్రూప్ రూ.50 కోట్ల వరకు అమ్మకాలు చేసినట్లు.. ఈ విషయంపై నిఘా ఉంచి ఈ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.