అవును.. మీ క్రెడిట్ / డెబిట్ కార్డ్ డేటా డార్క్ వెబ్లో చాలా చౌకగా అమ్మేసే ప్రమాదం పొంచి ఉంది. మధ్యప్రదేశ్లో ఇండియన్ బ్యాంక్ కస్టమర్స్కు చెందిన డేటా ఇలాగే వెబ్లో అమ్మకానికి పెట్టేశారు. అదీ 500 రూపాయల కంటే తక్కువకే. మధ్యప్రదేశ్ పోలీసులు ఓ సైబర్ క్రైమ్ను ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎలా బయటపడింది?
మధ్యప్రదేశ్కు చెందిన బ్యాంకింగ్ ప్రొఫెషనల్ తన క్రెడిట్ కార్డ్ అకౌంట్లో నుండి తనకు తెలియకుండానే 72,401 రూపాయల డెబిట్ అయిపోయాయని ఉజ్జయిని సైబర్ సైల్ వింగ్కు కంప్లయింట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఈ క్రెడిట్ కార్డ్తో ముంబయికి చెందిన రాజ్కుమార్ పిళ్లై ఎయిర్టికెట్స్ కొన్నాడని కనిపెట్టారు. అతన్ని అరెస్టు చేసి కూపీ లాగి మరో నిందితడు రామ్ప్రసాద్ నాడార్ను కూడా అరెస్టు చేశారు. పిళ్లై కాగ్నిజెంట్లో పని చేసి మానశాడు. నాడార్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఎంప్లాయి. వీళ్లిద్దరూ పాకిస్థాన్లోని లాహోర్లో ఉంటున్న షేక్ అఫ్జల్ అలియాస్ సోజీ నుంచి క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ కొని వాటిని ఉపయోగించి ఎయిర్టికెట్స్, ఖరీదైన వస్తువులు కొంటున్నారు. ఇలా వీళ్లిద్దరూ బ్యాంకాక్, మలేషియా, హాంకాంగ్, దుబాయ్ వంటి దేశాలన్నీ తిరిగొచ్చారు.
8 డాలర్లు ఇస్తే చాలు
డార్క్ వెబ్ ద్వారా వీళ్లు సోజీ నుంచి క్రెడిట్ కార్డు డేటా కొంటున్నారు. ఇందుకు ఒక్క కార్డుకు వాళ్లు చెల్లించేది 8 డాలర్లు (అంటే 500 రూపాయలు). అదీ బిట్ కాయిన్ల రూపంలో కాబట్టి ఎవరికీ తెలియదు. డార్క్ వెబ్లో చూస్తే ఇండియన్ క్రెడిట్ కార్డ్ యూజర్ల డేటా చాలానే ఉన్నట్లు ఐడెంటిఫై చేశామని పోలీసులు చెప్పారు. ఈ డేటాను కొనుక్కుని వాడుకునేవారు చాలా జాగ్రత్తగా వాడుతున్నారు కాబట్టి మనీ ఖర్చయిన తర్వాతగానీ అసలు కార్డు హాల్డర్లకు తెలియడం లేదు.