పేమెంట్ బ్యాంక్.. ఈ పేరు భారత్ను ఊపేస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు బ్యాంకు అంటే మనకు తెలిసిన అర్థం బ్యాంకు అనే. కానీ ఇప్పుడు బ్యాంకులు చాలా రకాలు ఉన్నాయి. అందులో పేమెంట్ బ్యాంకులు ఒకటి. అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధం లేని కంపెనీలు కూడా పేమెంట్ బ్యాంకులు తెరుస్తున్నాయి. డిమోనిటైజేషన్ వచ్చిన తర్వాత.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు బాగా పెరిగిన తర్వాత పేమెంట్ బ్యాంకింగ్ విధానం బాగా ఎక్కువైపోయింది. ఎక్కువమంది ఆన్లైన్ ట్రాన్సాక్షలకే మొగ్గు చూపుతున్నారు. అయితే అలా వచ్చిన పేమెంట్స్ బ్యాంకుల్లో కొన్ని ప్రముఖమైన వాటిని చూద్దామా..
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
భారతీ ఎయిర్టెల్, కొటాక్ మహేంద్ర బ్యాంకు ఈ పేమెంట్స్ బ్యాంకును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2016 నవంబర్ 23న దీన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆధార్ కార్డు, ఒక మొబైల్ నంబర్ ఉంటే చాలు సెకన్లలో ఈ పేమెంట్ బ్యాంకు ఖాతాను తెరవచ్చు. రూ.10తో కనీస నిల్వతో ఈ ఖాతాను తెరిచే అవకాశం ఉంది. మాగ్జిమం రూ.1 లక్ష వరకు మనీని దాచుకునే అవకాశం ఉంది. దీనికి 7.25 శాతం వడ్డీ కూడా ఇస్తోంది ఎయిర్టెల్. మధ్యలో కాష్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే అమౌంట్పై 0.65 శాతం ఛార్జీతో తీసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఫీజు ఏమిలేదు. అయితే ఇది ఎయిర్టెల్ బ్యాంకు టు ఎయిర్టెల్ బ్యాంకు వర్తిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు నుంచి మరో బ్యాంకు అయితే రూ.1000కి 0.5 శాతం రుసుము వసూలు చేస్తారు. దీనికి ఏటీఎం కార్డు, చెక్బుక్లు ఉండవు.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు
భారత ప్రభుత్వ తపాల శాఖ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. భారత పౌరులు ఎవరైనా సరే గుర్తింపు కార్డుతో అకౌంట్ ఓపెన్ చేయచ్చు. ఇందులో మూడు రకాల అకౌంట్లు ఉన్నాయి. ఒకటి సఫాల్ (రెగ్యులర్ అకౌంట్), సుగమ్ (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్), సరళ్ (చిన్నస్థాయి అకౌంట్). మినిమమ్ బాలెన్స్ ఏమి లేదు. మాగ్జిమం రూ.1 లక్ష వరకు డిపాజిట్ చేసుకోవాలి. అసలు మీద 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. బ్రాంచ్ బ్యాంకింగ్కు 4 ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి. దాని తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కు రూ.20 ఛార్జీ చేస్తారు. ఏటీఎం ట్రాన్సాక్షన్లు భారత పోస్ట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలలో ఫ్రీ. ఇతర బ్యాంకుల ఏటీఎం లలో 5 ట్రాన్సాక్షన్ల వరకు ఫ్రీ.. ఆ తర్వాత ఛార్జీ పడుతుంది. రూ.2.5 నుంచి 5 లక్షల వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. మ్యుచువల్ ఫండ్స్, ఇన్సురెన్స్ స్కీమ్లు కూడా ఈ పేమెంట్స్ బ్యాంకు అందిస్తోంది.
పేటీఎం పేమెంట్ బ్యాంకు
వన్97 కమ్యునికేషన్స్, సాఫ్ట్ బ్యాంకు గ్రూప్, అలీబాబా గ్రూప్, ఏఎన్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్రూప్, రతన్టాటా గ్రూప్ల ఆధ్వర్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నడుస్తోంది. మే 23, 2017లో ఇది ప్రారంభమైంది. ఇంకా ఖాతాలు తెరడం ప్రారంభం కాలేదు. రూ.1 లక్ష వరకు మాగ్జిమం బాలెన్స్ ఉంచుకోవచ్చు. నెలకు రూ.4 శాతం వడ్డీ ఇస్తారు. ఐఎంపీఎస్, యూపీఐ, రూపే ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చకు. ట్రాన్సాక్షన్కు రూ.5 వసూలు చేస్తారు. ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు, రూపే డెబిట్ కార్డు ఇష్యూ చేస్తారు. రూ.100 వార్షిక సబ్స్క్రిప్షన్ ఉంటుంది. 10 లీవ్స్ ఉన్న చెక్బుక్ కూడా ఇస్తారు.