స్మార్ట్ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయాక.. లావాదేవీలు ఒక స్థాయికి చేరిన తర్వాత వినియోగదారులు ప్రతి పనికి ఉరుకులు పరుగులు తీయట్లేదు. చిటికెలో పని అయిపోయేలా చూసుకుంటున్నారు. ఒక ప్పుడు డబ్బులు పంపాలంటే బ్యాంకులు,పోస్టాఫీసులకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక యాప్లతో సెకన్లలో పని అయిపోతుంది. ముఖ్యంగా పేటీఎం లాంటి యాప్లు వినియోగదారులకు అరచేతిలో బ్యాంకు మాదిరిగా మారిపోయాయి. డీమానిటైజేషన్ వచ్చిన తర్వాత పేటీఎం వాడకం చాలా ఎక్కువ అయింది. అయితే పేటీఎంతో పాటు హైక్, వాట్సప్ కూడా వాలెట్లను తీసుకొచ్చాయి. భారత్లో ప్రస్తుతానికి ఇవి లభ్యం కాకపోయినప్పటికీ త్వరలోనే ఇవి రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. కచ్చితంగా ఇవి పేటీఎంకు గట్టిపోటీ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ..
ప్రపంచంలో చాటింగ్, మెసేజింగ్కు ఎక్కువగా ఉపయోగించే యాప్ వాట్సప్. భారత్లో ఈ సంఖ్య భారీగా ఉంది. అయితే ఇన్నాళ్లు చాటింగ్, మెసేజింగ్, ఫొటో, వీడియో షేరింగ్లకు మత్రమే పని చేసిన వాట్సప్ ఇకపై మనీ వాలెట్ కార్యకలాపాలను నిర్వహించనుంది. అందుకే భారత ప్రభుత్వంతో చర్చలు కూడా సాగిస్తోంది ఇప్పటికే యూపీఐ లాంటి ప్రభుత్వ డిజిటల్ పేమెంట్ పద్ధతి అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలోనే భారత్లో అడుగుపెట్టేందుకు వాట్సప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 25 బిలియన్ల ట్రాన్సాక్షన్లు జరగాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో యూపీఐతో పాటు కొత్త పేమెంట్ పద్ధతులను కూడా ప్రోత్సహించే అవకాశాలున్నాయి.
హైక్ కూడా..
మెసేజింగ్ యాప్ హైక్ కూడా డిజిటల్ పేమెంట్ రేసులో ఉంది. భారత్లో ఎక్కువగా దీన్ని వాప్తి చేయాలనే ఆలోచనలో ఈ సంస్థ ఉంది. అయితే వాట్సప్తో పోలిస్తే హైక్కు మన దేశంలో రీచ్ తక్కువ. వాట్సప్ వాడినంత విస్తృతంగా హైక్ను వాడరు. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ను ఒక మార్గంగా చేసుకుని ముందుకు వెళ్లాలనేది హైక్ లక్ష్యం. వాట్సప్, హైక్ మాత్రమే కాదు క్వాట్రో లాంటి కంపెనీలు కూడా డిజిటల్ పేమెంట్స్పై దృష్టి పెట్టాయి. సోషల్ మీడియా సైట్లు ఇలా పేమెంట్ వేను ప్రవేశపెట్టడం వల్ల ప్రజలకు చేరువ కావడం సులభంగా ఉంటుందని... అంతేకాక వారికి నమ్మకం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కుదురుకున్న యూపీఐ, పేటీఎం లాంటి వాటికి వాట్సప్, హైక్ ఇతర
పేమెంట్ సంస్థలు ఏ మేరకు పోటీ ఇవ్వగలవో చూడాలి.