ఒకప్పుడు విమాన టిక్కెట్లు అంటే చాలా ఖరీదు ఉండేవి. కానీ ఇప్పుడు అందరికి అందుబాటు ధరల్లో పెడుతున్నారు. అన్ని వేళలా కాకపోయినా సీజన్లలో అయినా సామాన్యులు కూడా విమాన టిక్కెట్లు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. అయితే అన్ సీజన్లలో మాత్రం విమాన టిక్కెట్ల ధరలు ఆకాశంలోనే ఉంటాయి. అయితే భారత్లో విమాన టిక్కెట్లను అతి తక్కువ ధరలకు బుక్ చేసే సైట్ ఒకటి ఉంది. కానీ ఆ సైట్లో మీరు టిక్కెట్లను కొనాలంటే బిట్కాయిన్లు ఉపయోగించాల్సిందే.
అంతా బిట్ కాయిన్స్ ద్వారానే..
భారత్లో డిమానిటైజేషన్ పుణ్యమా అని బిట్కాయిన్ల ధర కూడా అమాంతం పెరిగింది. బిట్కాయిన్ల ద్వారా చేసే లావాదేవీలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఏం కొనాలన్నా.. ఏం అమ్మాలన్నా బిట్కాయిన్ల ద్వారా చేస్తున్నారు చాలామంది. అయితే బిట్కాయిన్ల గురించి అందరికి అవగాహన ఉండదు. ఆన్లైన్ ద్వారా మూడో కంటికి తెలియకుండా.. లీగల్గా చేసే ఈ ప్రాసెస్ ఇప్పుడు హాట్ ట్రెండ్గా ఉంది. 2013లో బిట్కాయిన్ ధర 13 డాలర్లుగా ఉంటే.. 2015కు ఇది 260 డాలర్లకు చేరుకుంది. అయితే ఈ ఏడాది జూన్ నాటికి రికార్డు స్థాయిలో ఈ ధర 3000 డాలర్లకు చేరుకుంది. దీన్ని బట్టే డిజిటల్ మార్కెటింగ్లో బిట్కాయిన్స్ ఎంతగా ఉపయోగిస్తున్నారో చెప్పొచ్చు. జిబ్పే, యూని కోయిన్ లాంటి సైట్లు భారత్లో బిట్కాయిన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఫ్లైబిట్... చాలా చౌక
బిట్ కాయిన్లు ఉపయోగించి విమానాలు బుక్ చేయడానికి ఫ్లైబిట్ అనే సైట్ ఉంది. దీనిలో ట్రాన్సాక్షన్లు అన్ని బిట్కాయిన్ల ద్వారానే జరుగుతాయి.దీనిలో డొమిస్టిక్ ఫ్లయిట్లను ఎక్కడ నుంచి ఎక్కడికి బుక్ చేసినా సాధారణ ధరల కంటే చాలా తక్కువకే మనం టిక్కెట్లను పొందొచ్చు. అంతేకాదు ఆఫర్లు కూడా ఉంటాయి. దీంతో సాధారణ ధరల కంటే సగం ధరకే మనం విమాన టిక్కెట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్లైబిట్తో పాటు పాకెట్బిట్స్ కూడా ఇలాంటి సైటే. అయితే క్రెడిట్కార్డు మోసాలకు ఇది కేంద్రంగా మారింది. ఈ ఫిబ్రవరిలో ఈ సైట్ స్టార్ట్ చేస్తే 15000 సైన్ అప్స్తో పాటు 1200 బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి.