రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ను షేక్ చేస్తున్న రోజులివి. ముఖ్యంగా భారత టెలికాం మార్కెట్పై చైనా కంపెనీల ప్రభావం ఎక్కువైన తర్వాత పోటీ బాగా పెరిగిపోయింది. ఆన్లైన్లో సేల్స్ పెట్టడం.. కౌంట్డౌన్ షురూ చేయడం.. ముందుగానే బుక్ చేసుకోవాలని చెప్పడం... ఇన్ని లక్షల పీస్లు అమ్మాం అని చెప్పుకోవడం ఎక్కువైంది. నిజానికి ఆయా కంపెనీలు అన్ని ఫోన్లను అమ్మాయా లేదా అనే విషయం ఎవరికి తెలియదు. ఒకటి రెండుసార్లు అంటే నమ్మొచ్చగాని ప్రతిసారీ కొన్నిలక్షల సంఖ్య ఫోన్లు అమ్మకాలు జరిగాయంటేనే అనుమానాస్పదం. అయితే ఈ మధ్య మరో కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. మన మెయిల్స్కు లేదా వాట్సప్కు కొన్ని మెసేజ్లు ఫార్వర్డ్ అవుతున్నాయి. రూ.999 కే ఫోన్లు, 99 కే ఫోన్లు అని ఊదరగొడుతున్నారు. ఈ ఆఫర్లు నిజమని మీరు నమ్మితే ఇంతే సంగతులు. తాజాగా జియోమి రెడ్ మి నోట్ 4 విషయంలో ఇదే జరుగుతోంది.
ఆఫర్లు చూసి కొనండి
రెడ్ మి నోట్ 4 విజయవంతం కావడంతో జియోమి కంపెనీ మంచి ఉత్సాహంతో ఉంది. తన ఆన్లైన్ భాగస్వామి ఫ్లిప్కార్టు సాయంతో మరిన్ని ఫోన్లను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఫ్లిప్కార్టులో ప్రొమోషనల్ సేల్ మొదలు పెట్టింది. రూ.999 కే రెడ్ మి నోట్ 4 మోడల్ను అమ్మకానికి పెట్టింది. అయితే ఒరిజినల్ ధర రూ.9999 గా ఉన్న ఈ ఫోన్ను రూ.999 కే అమ్మడానికి జియోమి ఎందుకు ముందు వచ్చింది? జియోమి రెడ్మి నోట్ 4 ఆరంభ ధర రూ.9999, దీనిలో 2జీబీ ర్యామ్తో పాటు 32 జీబీ స్టోరేజ్ ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్లను వరుసగా రూ.10,999, రూ.12.999కి అమ్ముతోంది జియోమి. అయితే రూ.999 కి ఫోన్ అన్న మాట నిజమే కానీ.. అది ఎక్స్ంజ్తో అంట!! అది కూడా 4 జీబీ ర్యామ్ వెర్షన్కు రూ.12 వేలు, 3 జీబీ ర్యామ్కు రూ.10 వేలు డిస్కౌంట్ వస్తుంది. అంటే మామూలు ఫోన్కు ఎలాంటి డిస్కౌంట్ రాదు.
ఏమిటీ ఎక్సేంజ్ మాయ
ఇప్పుడు ఫోన్ కంపెనీలన్నీ ఎక్సేంజ్ పాట పడుతున్నాయి. ఎందుకంటే ఈ ఆఫర్ పేరుతో పెద్దగా వాడని ఫోన్లను తీసుకుని కొత్త ఫోన్ ఇస్తున్నారు. ఎందుకంటే రెడ్ మి నోట్ 4 వెర్షన్ వచ్చి ఎంతో కాలం కాలేదు. మరి వినియోగదారులు కూడా ఎక్కువ వాటిని వాడరు. ఇప్పుడు తాజా ఫోన్లు తక్కువ ధరకు కావాలంటే ఆ ఫోన్లు ఇచ్చి తీరాలి. అది కాక పికప్ కోసం రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే మీరు రూ.999 కాక రూ.1099 చెల్లిస్తున్నారు. ఇక్కడ మరో వంద రూపాయిలు నష్టం. అయితే ఇలా ఎక్స్చేంజ్లో వచ్చే ఫోన్లు బెస్ట్గా ఉంటాయా లేదా అనేది కూడా అనుమానించాల్సిన విషయమేనని నిపుణులు అంటున్నారు.