ఆన్లైన్ షాపింగ్... ఇదిప్పుడు చాలా కామన్. డిజిటల్ యుగంలో సమయం ఆదా చేసుకోవడానికి, పని సులభంగా జరిపించుకోవడానికి అందరూ అనుసరిస్తున్న మార్గమిదే. 2017లో భారత్లో ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఇ-కామర్స్ ఇప్పుడు చిన్న ఊళ్లలోకి సైతం వచ్చేసింది. అయితే 2018 కొత్త ఏడాదిలో ఆన్లైన్ షాపింగ్లోనూ కీలక మార్పులు రానున్నాయి. అవేంటి.. వాటికి అనుగుణంగా మనల్ని మనం సిద్దం చేసుకోవడం ఎలాగో చూద్దామా..
ఫ్లిప్కార్ట్ ఏఐ టెక్నాలజీ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ప్రకంపనలు రేపుతున్న టెక్నాలజీ ఇది. స్మార్ట్ఫోన్లలో ఈ సాంకేతికత ఓ సంచలనం. ఇప్పుడు ఇదే సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించకోవాలని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ప్రయత్నిస్తోంది. అంటే జస్ట్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా మన మాతృభాషలో ఆర్డర్ ఇస్తే చాలు. ఆ ఆర్డర్ను పిక్ చేసుకుని వెంటనే మనకు కావాల్సిన వస్తువులను వెంటనే డెలివరీ చేస్తుంది ఫ్లిప్కార్ట్. ఆ సంస్థ ఇటీవలే ప్రవేశపెట్టిన ఏఐ ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన దేశంలో కొత్త ఏడాదిలో వినూత్నంగా ప్రవేశపెట్టాలని ఆ సంస్థ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఇ-కామర్స్ వ్యాపారాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాలనేది ఆ సంస్థ వ్యూహం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వల్ల విజువల్ సిమిలారిటీ, ఫ్రాడ్ డిటెక్షన్ లాంటి పనులు కూడా సులభం అవుతాయని ఫ్లిప్కార్ట్ భావిస్తోంది.
అమెజాన్ సైతం..
భారత్లో బలమైన ఇ-కామర్స్ వ్యాపారం ఉన్న అమెజాన్ కూడా ఫ్లిప్కార్ట్కు ఏ మాత్రం తగ్గకుండా ఏఐ టెక్నాలజీని ఉపయోగించే పనిలో ఉంది. ఆన్లైన్ సేవల్లో మాత్రమే కాక కస్టమర్లకు మంచి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం కూడా అమెజాన్ ఏఐ టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. దీని వల్ల కస్టమర్లతో తమకు మధ్య రిలేషన్ మరింత దృఢపడుతుందనేది ఆ సంస్థ ఆలోచన. వేర్ హౌసింగ్తో పాటు ఆన్లైన్ వ్యాపారంలోని వివిధ దశల్లో ఏఐ టెక్నాలజీ వాడాలనేది అమెజాన్ ఆలోచన. ఆ సంస్థ నడుపుడుతున్న అలెక్సా సైట్లో సైతం ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేసింది అమెజాన్. వాయిస్ ఆధారంగా పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ను కూడా సెట్ చేసింది. దీని కోసం ఎంతో మంది నిపుణులు నియమించుకుంటోంది. ఐఐటీ, ఐఐఎస్సీల్లో ప్రతిభావంతులను వెతికి వారికి పెద్ద మొత్తంలో శాలరీలు ఇచ్చి మరీ ఏఐ టెక్నాలజీకి మరింత పదును పెంచుతోంది.