ఆన్ లైన్ కొనుగోళ్లు, బిల్ పేమెంట్లలో క్యాష్ బ్యాక్ లు అందరికీ తెలిసినవే. వ్యాలట్ సంస్థల నుంచి ఎక్కువగా ఇలాంటి బెనిఫిట్ అందుతోంది. ఈ రంగంలో ముందున్న పేటీఎం ఎప్పటికప్పుడు మరింత ఇన్నొవేటివ్ ఐడియాలతో వినియోగదారులను ఆకట్టుకుంటుండడమే కాకుండా కొత్త వినియోగదారులను కూడా చేర్చుకుంటోంది. క్యాష్ బ్యాక్ ల విషయంలో అందరి కంటే ముందున్న పేటీఎం ఇప్పుడు మరో కొత్త విధానంతో ముందుకొచ్చింది. క్యాష్ బ్యాక్ ను క్యాష్ రూపంలోనే కాకుండా డిజిటల్ గోల్డ్ రూపంలోనూ ఇవ్వనుంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఎంఎంటీసీ-ప్యాంప్తో పేటీఎం జట్టు కట్టి.. కనీసం రూ.1కే డిజిటల్ పసిడి కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ డిజిటల్ గోల్డ్ పథకానికి మంచి ఆదరణ వచ్చింది. పేటీఎంలో గోల్డ్ కొనుగోలు చేసి హోల్డ్ చేసేవారు, ఇంటికే తెప్పించుకునేవారు ఉన్నారు. ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి పేటీఎంలోనే హోల్డ్ చేసి అవసరమైనప్పుడు మాత్రమే ఇంటికి తెప్పించుకుంటున్నారు కొందరు. దీనివల్ల లాకర్లలో పెట్టుకున్నంత సేఫ్ గా ఉంటుందంటున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు పేటీఎం క్యాష్ బ్యాక్ ను డిజిటల్ గోల్డ్ గా ఇవ్వనుండడతో వినియోగదారుల నుంచి మరింత స్పందన రావడం ఖాయమని తెలుస్తోంది.
క్యాష్ బ్యాక్ ను వినియోగదారులు క్యాష్ రూపంలో కావాలా లేదంటే పేటీఎం గోల్డ్ రూపంలో కావాలా అన్న ఆప్షన్ ఇస్తారు. వినియోగదారులు రెండిట్లో ఏది కావాలో అది ఎంచుకోవచ్చు. పేటీఎం గోల్డ్ రూపంలో కావాలంటే వినియోగదారులకు ప్రత్యేక ప్రోమో కోడ్ అందుతుంది.. దాని ద్వారా నగదు వాపసును పేటీఎం గోల్డ్గా మలుచుకోవచ్చు.