• తాజా వార్తలు

ఆన్ లైన్లో పెట్రోల్ ఆర్డర్: మోడీ గవర్నమెంట్ ట్రయల్స్


ఇకపై బైక్ లోనో... కారులోనో పెట్రోలు పోయించుకోవడానికి బంకుల వద్ద గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చే రోజులు రానున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉంది. రద్దీ సమయాలలో పెట్రోలు పోయించుకోవడం కోసం వాహనదారులు క్యూలలో నిరీక్షించాల్సి వస్తున్నది. ఇది వినియోగదారులతో పాటు బంకులకూ ఇబ్బందికరంగానే ఉంది. దీంతో చమురు సంస్థల వెబ్ సైట్ల నుంచి ఆర్డర్ చేస్తే ఇంటికే తెచ్చి ఇచ్చే అవకాశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ పరిశీలిస్తోంది.
క్యాష్ లెస్ ట్రాంజాక్షన్లతో మరింత రద్దీ...
ఒకప్పుడు బంకులో పెట్రోలో, డీజిలో పోయించుకుంటే రూ.50 నుంచి రూ. వెయ్యి అంతకంటే ఎక్కువ మొత్తానికి పోయించుకుని అంత మొత్తం వెంటనే ఇచ్చేసేవారు. కానీ... ఇప్పుడు నగదు అందుబాటులో లేకపోవడంతో కార్డులు, వ్యాలట్లతో పే చేయాల్సి వస్తోంది. ఇది బంకుల వద్ద రద్దీ పెరగడానికి కారణమవుతోంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పే చేస్తే పిన్ నంబరు నమోదు చేయడం వంటివాటికి సమయం పడుతోంది. అంతేకాదు... నగరాల్లో కార్డు ట్రాంజాక్షన్లు విపరీతంగా పెరగడం వల్ల నెట్ వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చి ట్రాంజాక్షన్ ఆలస్యమవుతోంది. అలాగే... ఇంతకుముందు కంటే స్వైపింగ్ యంత్రాలపై ఒత్తిడి పెరగడంతో అవి కూడా అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి. దీంతో బంకుల వద్ద రద్దీ పెరుగుతోంది.

బంకుల వద్ద వందలాది మది పోగయినప్పుడు కొందరు మొబైల్ ఫోన్లు మాట్లాడడం వంటివి చేయడం ప్రమాదకరంగా పరిణమించొచ్చు. ఇవన్నీ ఆలోచించే కేంద్రం ఆయిల్ హోమ్ డెలివరీ దిశగా ఆలోచన చేస్తోంది. ఆన్‌లైన్లో బుక్‌ చేసుకుంటే పెట్రోల్, డీజిల్‌ వంటి పెట్రోలియం ఉత్పత్తులను ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ దిశగా పెట్రోలియం ఉత్పత్తుల డోర్‌–టు–డోర్‌ డెలివరీ సర్వీసులు అందించేలా ఈ–కామర్స్‌ విధానాన్ని పరిశీలించాలంటూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) వంటి చమురు మార్కెటింగ్‌ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించనుంది.

మే 14 నుంచి పలు రాష్ట్రాల్లో బంకులను ఆదివారం మూసి ఉంచాలని బంకు ఓనర్లు యోచిస్తున్న నేపథ్యంలో తాజా ఆన్‌లైన్‌ బుకింగ్, డోర్‌ డెలివరీ విధానం ప్రతిపాదన పట్ల అంతటా ఆసక్తి నెలకొంది.

జన రంజకమైన వార్తలు