ఫేస్బుక్ వాడని వాళ్లు ఉండరు ఇవాళా.. రేపట్లో! సిస్టమ్లోనే కాదు స్మార్ట్ఫోన్లోనూ ఎక్కడ ఉన్నా ఫేస్బుక్ని వదలట్లేదు. కేవలం యూత్ మాత్రమే కాదు పెద్ద వాళ్లు కూడా ఈ సోషల్ మీడియా సైట్ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. మనం ఫేస్బుక్ ఓపెన్ చేయగానే చాలా ఆర్టికల్స్ కనబడతాయి. మన స్నేహితులో లేక స్నేహితుల స్నేహితులో వాటిని షేర్ చేస్తూ ఉంటారు. అన్నిటిని చదవకపోయినా మనకు ఆసక్తి కలిగించే కొన్ని స్టోరీలనైనా చదువుతాం. నచ్చితే వాటిని షేర్ చేస్తాం. అయితే ఇకపై మనం ఫేస్బుక్లో ఆర్టికల్స్ చదవాలంటే డబ్బులు కట్టాల్సి రావొచ్చు. అయితే అన్ని ఆర్టికల్స్కు కాదు తమ పోర్టల్లో పబ్లిష్ చేసిన కొన్ని ఇన్స్టంట్ ఆర్టికల్స్ను చదివేందుకు డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనలో ఉంది ఈ సంస్థ.
పేవాల్ ప్రొగ్రామ్
ఇటీవలే న్యూయార్క్లో జరిగిన డిజిటల్ పబ్లిషింగ్ ఇన్నోవేషన్ సదస్సులో ఫేస్బుక్ న్యూస్ పార్టనర్షిప్ అధినేత కాంప్బెల్ బ్రౌన్ కొన్ని కొత్త విషయాలు చెప్పారు. ఇన్స్టంట్ ఆర్టికల్స్ కోసం పేవాల్ ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు .. కంటెంట్ను రీడ్ చేయడానికి పే చేయాల్సి ఉంటుందని ఆయన మాటల సారాంశం. ఇన్స్టంట్ ఆర్టికల్స్ రాసేవాళ్ల అభ్యర్థన మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్బీ తెలిపింది. ఇన్స్టంట్ ఆర్టికల్ను క్లిక్ చేసినప్పుడు మాత్రమే పేమెంట్ వివరాల గురించి మనకు తెలుస్తుంది. అదే మామూలు ఆర్టికల్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇన్స్టంట్ ఆర్టికల్పై క్లిక్ చేసిన వెంటనే అతను పబ్లిషర్ సొంత వెబ్సైట్కు డైరెక్ట్ అవుతాడని.. అక్కడే అతను పే చేసి ఆర్టికల్ చదవే అవకాశం ఉంటుందని ఫేస్బుక్ తెలిపింది.
క్లిక్ అవుతుందా?
ఫేస్బుక్ చేపట్టిన ఈ కొత్త పే వాల్ కార్యక్రమం ఎంత మేరకు విజయవంతం అవుతుందనేది ప్రశ్న. ఇన్నాళ్లు ఉచితంగా కంటెంట్ చూడటానికి అలవాటు పడ్డ జనం.. డబ్బులు చెల్లించి చదవాలంటే కష్టమే. అయితే చాలా కీలకమైన సమాచారం అయితే మాత్రమే డబ్బులు చెల్లించి చదివేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇన్స్టంట్ ఆర్టికల్ ప్రోగ్రామ్ వల్ల తమకు ఇబ్బందిగా ఉందని సాధారణ పబ్లిషర్స్ అంటున్నారు. ఫేస్బుక్ తనకు వచ్చే ట్రాఫిక్ను ఇన్స్టంట్ ప్రోగ్రామ్ కోసం మళ్లించడం వల్ల మిగిలిన ఆర్టికల్స్ చదివే అవకాశం యూజర్లకు ఉండట్లేదనేది వారి మాట. దీని వల్ల తమకు తక్కువ ట్రాఫిక్, తక్కువ ఆదాయం వస్తుందనేది వారి మాట.