భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు ఏర్పడే అత్యవసర పరిస్థితులలో సాధారణంగా మొబైల్ నెట్ వర్క్ లు పనిచేయవు. అలాంటి పరిస్థితులలో కూడా ఉపయోగపడే విధంగా సైంటిస్ట్ లు ఒక యాప్ ను కనుగొన్నారు. అంటే అత్యవసర పరిస్థితులలో చిక్కుకున్న వారి ఫోన్ లు పనిచేయకపోయినా సరే వారు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారిని రక్షించవచ్చన్నమాట. స్పెయిన్ కు చెందిన యూనివర్సిడాడ్ డి అలికంటే కి చెందిన శాస్త్రవేత్తలు ఈ యాప్ ను డెవలప్ చేసారు.
ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న వారి ఫోన్ లలో ఒకవేళ వారు ప్రమాదం లో ఉండి ఫోన్ సిగ్నల్ పనిచేయకపోతే ఈ యాప్ ఒక వైఫై సిగ్నల్ ను విడుదల చేస్తుంది. ఇది కొన్ని కిలోమీటర్ ల వరకూ అందుతుంది. ఈ సిగ్నల్ లో లొకేషన్ కో ఆర్డినేట్స్ ఉంటాయి. వీటితో పాటు I am injured, I am disoriented, I need help లాంటి చిన్న మెసేజ్ లు కూడా ఆ వైఫై సిగ్నల్ లో ఉంటాయి. తద్వారా ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నదీ సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది.
మరి ఈ సిగ్నల్ ను డిటెక్ట్ చేయడం ఎలా?
సాధారణంగా ప్రమాదాలలో ఉన్న వారిని ఎవరు కాపాడతారు? రెస్క్యూ టీమ్ లెవ్ కదా! అవును ఆ రెస్క్యూ టీమ్ ల వారు సులభంగా ఈ సిగ్నల్ లను గుర్తిoచే విధంగా ఒక పోర్టబుల్ రిసెప్టర్ డివైస్ ను కూడా వారికోసం తయారు చేశారు. ఈ డివైస్ లు వైఫై సిగ్నల్ లను డిటెక్ట్ చేయడం ద్వారా ప్రమాదం లో ఉన్నవారి లొకేషన్ ను రెస్క్యూ టీం వారికి తెలియజేస్తుంది.
ఈ మద్యనే దీనిని నేలపై మరియు సముద్రం పై కూడా టెస్ట్ చేసారు. ఇది ప్రస్తుతం 2 నుండి 3 కిలోమీటర్ ల వరకూ ఉన్న సిగ్నల్ ను డిటెక్ట్ చేయగలుగుతుంది. అయితే దీని రీచ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం వైఫై సిగ్నల్ ల ద్వారా స్మార్ట్ ఫోన్ యొక్క లొకేషన్ గుర్తించే పరికరం ఏదీ ప్రపంచం లో లేదు. అయితే ఫోన్ సిగ్నల్ నుండి త్రిభుజీకరణ పద్దతి ద్వారా కనుగొనే కొన్ని డివైస్ లు ఉన్నాయి కానీ వీటి ధర సుమారుగా రూ 60 లక్షల వరకూ ఉంటుంది. అయితే వీటితో పోలిస్తే దీని ధర చాలా తక్కువ అని ఇది సుమారుగా రూ 47,000/- లు ఉంటుందని దీని డెవలపర్స్ చెబుతున్నారు.