• తాజా వార్తలు

మన ఐటీ సంస్థలు మోసం చేస్తున్నాయన్న అమెరికా


ఇండియన్ టెక్ సంస్థలకు అమెరికా నుంచి కష్టాలు తప్పేలా లేవు. మనకేమీ ఇబ్బంది ఉండదంటూ రాయబార కార్యాలయాలకు సమాచారమిస్తున్నా అక్కడ అమెరికాలో మాత్రం మన టెక్ దిగ్గజ సంస్థలకు షాక్ లిస్తోంది. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) - ఇన్ఫోసిస్ లు హెచ్1బీ వీసా నిబంధనలు ఉల్లంఘించాలయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. హెచ్1బీ వీసాల జారీని లాటరీ విధానం నుంచి మెరిట్ ఆధారిత పద్ధతికి మారుస్తున్న తరుణంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆరోపణలు చేసింది.

ఎక్కువ కొట్టేస్తున్నారు..
ప్రస్తుత లాటరీ విధానంలో అధిక వీసాలు పొందేందుకు కొన్ని ఐటీ ఔట్ సోర్సింగ్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు దాఖలు చేస్తున్నాయని తద్వారా డ్రాలో వీసాలు దక్కించుకునే అవకాశాలను భారీగా పెంచుకుంటున్నాయని రీసెంటుగా జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నట్లుగా వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్ వెల్లడించింది. ‘‘హెచ్-1బీ వీసాలు పొందే టాటా - ఇన్ఫోసిస్ - కాగ్నిజెంట్ మొదలైన సంస్థల నుంచి వీసాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా ఆ కంపెనీలు పొందాల్సిన దాని కన్నా ఎక్కువ. లాటరీ విధానంలో ఎక్కువ టికెట్లను ఉంచాయి. తద్వారా వీసాల మంజూరులో అగ్రభాగం వాటాను దక్కించుకునేలా వ్యూహం పన్నాయి’’ అని వైట్ హౌస్ అధికార వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది.

ఆ మూడే టాప్..
అయితే... కేవలం భారతీయ కంపెనీలనే ప్రస్తావిస్తే ఆక్షేపిస్తారని ముందే గుర్తించిన వైట్ హౌస్ వర్గాలు అందుకు కారణమేంటో కూడా వివరణ ఇచ్చారు. హెచ్-1బీ వీసాలు పొందే వారిలో టీసీఎస్ - ఇన్ఫోసిస్ - కాగ్నిజెంట్ సంస్థలే మొదటి స్థానంలో ఉన్నాయని అందుకే వాటి పేరునే ప్రస్తావించినట్లు వివరణ ఇచ్చింది. సిలికాన్ వ్యాలీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల సరాసరి వార్షిక వేతనం 1.50 లక్షల డాలర్ల స్థాయిలో ఉండగా.. ఈ మూడు సంస్థలు హెచ్1బీ వీసాపై పనిచేసే వారికి ఏటా 60-65 వేల డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నాయని తెలిపింది. అయితే... వైట్ హౌస్ చేసిన ఆరోపణలపై ఆ సంస్థలు ఏమాత్రం స్పందించలేదు.

జన రంజకమైన వార్తలు