భారత్లో జియో దూసుకెళ్తోంది. ఇప్పటికే లక్షలాది కస్టమర్లను తన వైపు తిప్పుకున్న ముఖేశ్ అంబాని సంస్థ.. మరింత మందిని ఆకర్షించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జియో సర్వీసులతో సంచలనం సృష్టిస్తున్న జియో త్వరలోనే ఇంటింటికి ఇంటర్నెట్తో ముందుకు రానుంది. ఇన్ని రోజులు మొబైల్స్కు మాత్రమే పరిమితమైన జియో..ఇకపై డొమెస్టిక్ సర్వీసులకు కూడా సై అంటోంది. దీనిలో భాగంగానే జియో బ్రాడ్బ్యాండ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం భారత్లో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నెట్ అందుబాటులో ఉంచేలా చేయాలన్నది జియో సంకల్పం. ప్రస్తుతం మన దేశంలో ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కువగా యాక్ట్ ఫైబర్, బీఎస్ఎన్ఎల్ లాంటి బ్రాడ్బ్యాండ్ సర్వీసులను వాడుతున్నారు. ఇప్పుడు ఆ సంస్థలకు దెబ్బ కొట్టి బ్రాండ్బ్యాండ్లోనూ నంబర్వన్గా నిలవాలని జియో భావిస్తోంది. ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్టీటీహెచ్) పేరుతో ఒక బ్రాండ్బ్యాండ్ సర్వీసును లాంచ్ చేయడానికి జియో ప్రయత్నాలు ప్రారంభించింది.
కారు చౌకగా..
జియో నెట్ భారత్లోకి రావడమే ఒక సంచలనం. ఉచిత ఇంటర్నెట్ అందించి వినియోగదారులను దాదాపు బానిసలను చేసింది జియో.జియో దెబ్బకు మిగిలిన టెలికాం కంపెనీలు కూడా కిందకి దిగి రాక తప్పలేదు. ఈ నేపథ్యంలో బ్రాడ్బ్యాండ్ సర్వీసులను కూడా జియో అతి తక్కువ ధరలకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. తక్కువ ధరలతో పాటు అద్భుత వేగంతో వినియోగదారులను ఆకట్టుకోవాలనేది ఈ బ్రాడ్బ్యాండ్ ప్రయత్నం. టెలిఎనాలసిస్ ప్రకారం ఈ జూన్ నాటి కల్లా జియో తన పైబర్ టు ది హోమ్ను రంగంలోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఆరంభంలో భారత్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ట్రయల్ వేసి ఆ తర్వాత నెమ్మదిగా పల్లెలకు కూడా పాకాలని రిలయన్స్ ప్రణాళికలు రచిస్తోంది. 100 ఎంబీపీఎస్ స్పీడ్తో మొదలుకొని డేటా ప్లాన్లను అందించాలని జియో భావిస్తోంది. ప్రస్తుతం బ్రాడ్బ్యాంఢ్ సేవలు అందిస్తున్న సంస్థల కన్నా తక్కువ ధరలతో ఎక్కువ స్పీడ్తో వినియోగదాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు జియో చెప్పింది.