• తాజా వార్తలు

జియో ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్

రిలయన్స్ జియోకి పోటీగా ఇంటెక్స్‌ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్‌ అత్యంత తక్కువ ధరలో మరో 4జీ స్మార్ట్‌ఫోన్‌ ఇంటెక్స్‌ ఆక్వా లయన్స్‌ ఎన్‌1ను లాంచ్‌ చేసింది. కేవలం రూ.1,649కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు Airtel ప్రకటించింది. 

ఇంటెక్స్‌‌తో జతకట్టిన  Airtel రెండు స్మార్ట్‌ఫోన్లను రూ.1999కు ఆక్వా ఏ4ను, రూ.4,379కు ఆక్వా ఎస్‌3ను లాంచ్ చేసింది. ఇప్పటికే సెల్‌కాన్‌, కార్బూన్‌లతో కూడా ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. 

జియోఫోన్‌ లాంచింగ్‌ అనంతరం దిగ్గజ టెలికాం కంపెనీలు, మొబైల్‌ మేకర్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంటెక్స్‌ భాగస్వామ్యంతో 'మెరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' కార్యక్రమాన్ని ఎయిర్‌టెల్‌ మరింత విస్తరిస్తోంది.

ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఇంటెర్నెట్‌ ఎనేబుల్డ్‌ ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్‌ కూడా దేశీయ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి మైక్రమ్యాక్స్‌తో జతకట్టి, రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

ఇంటెక్స్‌ ఆక్వా లయన్స్‌ ఎన్‌1 ఫీచర్లు 
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌, 
డ్యూయల్‌ సిమ్‌ కార్డులు, 
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 
1.1గిగాహెడ్జ్‌ మీడియాటెక్‌ ప్రాసెసర్‌, 
1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 
2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 
4జీ వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వైఫై

అయితే ఈ ఫోన్లో చిన్న మెళిక కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 3,799 రూపాయలు. వినియోగదారులు రూ.3,149 డౌన్‌పేమెంట్‌ కట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం నుంచి రూ.1500ను ఎయిర్‌టెల్‌ క్యాష్‌బ్యాక్‌ రూపంలో అందిస్తుంది. అది పోగా మిగిలిన మొత్తం రూ. రూ.1,649. ఇది ఫోన్ అసలు ధర అని కంపెనీ చెబుతోంది.