ఇప్పుడు అంతా స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సప్ మెసేజ్లు, మెసేంజర్ నుంచి మెసేజ్ లు పంపుతున్నాం. అయితే ఇంట్నర్నెట్ వచ్చిన తొలి రోజుల్లో ఎస్సెమ్మెస్లు ఇంటర్నెట్ లేకుండానే మాములుగా పంపేవాళ్లం అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆ ఎస్సెమ్మెస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంది.
మొట్టమొదటిసారి 1992 డిసెంబర్ 3న నెయిల్ పాప్ వర్త్ అనే ఇంజినీర్ తొలి సందేశాన్ని పంపించారు. వొడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ నుంచి ఆ ఇంజినీర్ పంపిన తొలి ఎస్సెమ్మెస్ 'మెర్రీ క్రిస్మస్'. ఆ మెస్సేజ్ అందుకున్న వ్యక్తి ఆ సమయంలో వోడాఫోన్కు డైరెక్టర్ గా ఉన్న రిచర్డ్ జార్విస్ .
ఆ మరుసటి ఏడాది 1993లో నోకియా ఎస్సెమ్మెస్ లు పంపించే మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 1999లో ఇతర నెట్వర్క్ యూజర్లకు కూడా సందేశాలు పంపడం సాధ్యమైంది.
దీన్ని అనుసరిస్తూ జపాన్ వారు ఎమోజీలను క్రియేట్ చేయడం అప్పట్లో సంచలనమైంది కూడా. ఆ తర్వాతి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం, ఆపై స్మార్ట్ఫోన్లు రావడంతో నెట్ వాడి ఎస్సెమ్మెస్లు పంపడం, ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సప్ లలో తమ మిత్రులకు సందేశాల ద్వారా విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
తొలి సందేశాన్ని పంపిన పాప్వర్త్ ప్రస్తుత అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. '1992లో నేను పంపిన సందేశం ఇప్పుడు ఇంత ఫేమస్ అవుతోందని భావించలేదు. తొలి సందేశాన్ని పంపింది నేనేనని నా పిల్లలకు కొన్ని రోజుల కిందట చెప్పగా.. వారు ఎంతో సంతోషించారు. నా తొలి ఎస్సెమ్మెస్ మొబైల్ చరిత్రలోనే ఓ కీలక ఘట్టమని' ఇంజినీర్ పాప్వర్త్ వివరించారు.