ఆధార్ అన్నింటికీ ఆధారమంటోంది గవర్నమెంట్. 12 అంకెల ఆధార్ సంఖ్యే అన్ని పథకాలకూ అర్హత అంటోంది. లేటెస్ట్గా 36 ప్రభుత్వ పథకాలకు ఆధార్ నంబర్ను తప్పనిసరి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
* ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ కావాంటే ఆధార్ ఉండాల్సిందే. ఇలా సబ్సిడీ బదిలీ చేసే 84 గవర్నమెంట్ స్కీంలకు త్వరలోనే ఆధార్ తప్పనిసరి కాబోతోంది.
* మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ విద్యార్థులకు ఇచ్చే ఆరు రకాల స్కాలర్షిప్లకు ఆధార్ కంపల్సరీ చేసింది.
* నేషనల్ హెల్త్ మిషన్ పథకాల ప్రయోజనం పొందాలన్నా, సర్వశిక్ష అభియాన్లో పని చేసే స్టాఫ్కు జీతాలు కావాలన్నా ఆధార్
ఉండాల్సిందే.
ఇలా ప్రతి పథకానికి ఆధార్ను లింక్ చేస్తోంది గవర్నమెంట్.. అయితే ఆధార్ నంబర్ ఇచ్చామంటే మన వ్యక్తిగత వివరాలన్నీ ఇచ్చినట్లే. అలాంటప్పుడు ఇది ఎక్కడో ఓ చోట మిస్యూజ్ అయ్యే ప్రమాదం లేదా అనేది అందరిలో ఉన్న భయం. ఎంత కేర్ఫుల్గా ఉన్నా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని కూడా కొట్టేసే టెక్నికల్ దొంగలున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాచారాన్ని పెద్దగా భద్రత లేని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా ఇవ్వడం అన్నది అందరి డౌట్.
విదేశాల్లో ఒప్పుకోరు..
వ్యక్తిగత సమాచారం తస్కరణ విదేశాల్లో తీవ్రమైన నేరం. యూకే, యూఎస్ వంటి దేశాల్లో దీన్ని చాలా పెద్ద క్రైంగా చూస్తారు. బ్రిటన్లో 2010లో నేషనల్ ఐడెంటిటీ రిజిస్టర్ రూపొందించాలని ప్రయత్నించారు. అయితే అది ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఫ్రాన్స్లో తీవ్రవాదుల ప్రవేశాన్ని నిరోధించడానికి పౌరుల బయోమెట్రిక్ వివరాలు తీసుకోవాలని అక్కడి గవర్నమెంట్ ప్రయత్నించింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చే నడిచింది. వ్యక్తిగత వివరాల చోరీకి సంబంధించిన కేసులదే దేశంలోని నేరాల్లో రెండో స్థానమని, దాదాపు 50 శాతం కేసులు ఇవే ఉంటున్నాయని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది. కానీ ఇండియాలో అదంత సీరియస్ ఇష్యూగా తీసుకోరు కాబట్టే దాదాపు 100 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఇవ్వగలిగింది ప్రభుత్వం. దేశంలో 5నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న వారలో 75 శాతం మందికి ఆధార్ కార్డులున్నాయి. ఇక పెద్ద వాళ్లయితే దాదాపు అందరికీ ఆధార్ ఉంది. ఇప్పటికీ ఆధార్ తీసుకోనివాళ్లు ఉంటే జూన్ 30 లోగా తీసేసుకోవాలని గవర్నమెంట్ పదేపదే చెబుతోంది.
ఇండియాలో ఆధార్ నెంబరే సోషల్ సెక్యూరిటీ నెంబర్గానూ వినియోగిస్తున్నారు. దేశంలో 582 బ్యాంకులు, బ్రోకరేజి కంపెనీలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఆధార్ను వినియోగించుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ప్రైవేటు సంస్థలతో చేసే ఆర్థిక లావాదేవీలన్నింటిలోనూ ఆధార్ను తప్పనిసరి చేస్తున్నారని.. దీంతో ఆధార్ నెంబర్ కు లింకయి ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక వివరాలన్నీ ఉంటాయని చెబుతున్నారు. ఇంత ఎక్కువ డేటాకు ఆధార్ ముడిపడి ఉన్నప్పుడు ఆధార్ వ్యవస్థను మరింత ప్రొటెక్టివ్గా తీర్చిదిద్దాల్సిందే. ప్రైవేటు కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఆధార్ డేటాను వినియోగించుకోవడంతో దీని విస్తృతి పెరుగుతోంది. ఇందులో కొన్ని సంస్థలు, వెబ్సైట్లు ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఐడీఏఐ (ఆధార్ మాతృసంస్థ) ఆధార్ వివరాలను అక్రమంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఈ నెలలో 12 ప్రైవేటు వెబ్సైట్లు, 12 మొబైల్ అప్లికేషన్లపై చర్యలు తీసుకుంది. ఆధార్.. వ్యక్తిగత వివరాలను అంగట్లో పెట్టేసే ప్రమాదముందని కోర్టుల్లో ఎన్నో కేసులు నడుస్తున్నాయి. చాలా మంది మొత్తం ఆధార్ కార్యక్రమాన్నే వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు మాత్రం దీన్ని అన్నింటికీ వాడాలనుకోవడం సరికాదని వాదిస్తున్నారు. ఆధార్ కోసం డేటాను ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కలెక్ట్ చేయడం వ్యక్తిగత భద్రత రీత్యా అంత మంచిది కాదని సుప్రీంకోర్టు కూడా గత నెలలో సందేహం వ్యక్తం చేసింది. అయితే ఆధార్ కార్డుల జారీ చేయడం ఏకాభిప్రాయంతోనే చేస్తున్నామని సెంట్రల్ గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది. ఆధార్ వివరాలను సోషల్ బెనిఫిట్ స్కీమ్లలో తప్ప మరే రకంగా వినియోగించడం లేదని వెల్లడించింది. ప్రతి సిస్టంలోనూ కొన్నిఎర్రర్స్ ఉన్నట్లే ఆధార్ను కొందరు దుర్వినియోగం చేస్తుండవచ్చని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టరీ చెబుతోంది.
మోడీ కూడా వ్యతిరేకించారు..
అధికారంలోకి రాకముందు ప్రధాని మోడీ కూడా ఆధార్ను వ్యతిరేకించారు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను, జాతి భద్రతకు ముప్పని వాదించారు. కానీ ఇప్పుడాయన అన్నింటికీ ఆధారే కావాలంటున్నారు. డీమానిటైజేషన్ తర్వాత ఆధార్ బేస్డ్ పేమెంట్ యాప్ను కూడా తీసుకొచ్చారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లకు ఆధారే ఆధారం కావాలని కూడా మోడీ పట్టుబడుతున్నారు. సబ్సిడీ పథకాలను ఆధార్ తో అనుసంధానించాక దుర్వినియోగం తగ్గి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయిందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అందువల్లే కేంద్రం ఆధార్ను పథకాలకు కచ్చితంగా లింక్ చేస్తోంది.
జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
మోడీ డీమానిటైజేషన్ ప్రవేశపెట్టిన తర్వాత 4 కోట్ల 60 లక్షల మంది ఆధార్లో చేరారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం 119 బ్యాంకులు లింకయ్యాయి. ఇప్పటవరకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఆధార్ బయోమెట్రిక్ వివరాల నిబంధనలను ఉల్లంఘించారని యాక్సిస్ బ్యాంక్, సువిధ ఇన్ఫోసర్వ్, ఈ- ముద్రలపై యూఐడీఏఐ పోలీస్ కంప్లయింట్ కూడా చేసినట్లు వార్తలొచ్చాయి. 2013 ఏప్రిల్లో మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతానికి చెందిన దాదాపు 3 లక్షల మంది ఆధార్ డేటాను సర్వర్లో అప్లోడ్ చేస్తుండగా పోయినట్లు అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్తలు వచ్చాయి.
* ఆధార్ డేటాబేస్ మల్టీలేయర్ టెక్నాలజీతో ఉందని, అందువల్ల సెక్యూరిటీకి సంబంధించి తమకెలాంటి ఫిర్యాదులూ రాలేదని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు. అయితే ఆధార్ డేటా ను ఉపయోగించుకుని తయారుచేసే ప్రైవేటు డేటా బేస్లను మానిటర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
* ఆధార్తోపాటు ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ కూడా అందుబాటులో ఉంటాయని, అందువల్ల ఆధార్ డేటా బేస్ను ఉపయోగించి ఎకౌంట్లు నిర్వహించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఎర్నెస్ట్ అండ్ యంగ్కు చెందిన ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, డిస్ప్యూట్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ జాజు స్పష్టంగా చెప్పారు.
* ఆథ్బ్రిడ్జ్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్వాభిమాన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రెండూ ఆధార్ అథెంటికేషన్ ను యూజ్ చేస్తున్న రిజిస్టర్డ్ కంపెనీలు. కంపెనీలు పొటెన్షియల్ కస్టమర్లను, ఉద్యోగులను గుర్తించడానికి ఈ రెండు సంస్థలు ఆధార్ బయోమెట్రిక్స్ ను ఉపయోగిస్తున్నాయని సమాచారం.
ప్రభుత్వం ఏమంటోంది?
ఆధార్లో నమోదు చేయించుకున్న వారి వ్యక్తిగత వివరాల భద్రతకు ఎటువంటి ఢోకా లేదని భారత సమగ్ర గుర్తింపు ప్రాధికార (యూఐడీఏఐ) చెబుతోంది. ఆధార్ తీసుకునేటప్పుడు నమోదు చేసుకున్న వివరాలకు సమాంతరంగా సమాచారాలను తయారు చేస్తున్నట్లు వస్తున్న అపోహలను తొలగించడానికి ఆధార్ పథకం అధికారులు ఇటీవల ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సొంత బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ వివరాలను మార్చడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. దీన్ని యూఐడీఏఐ అంతర్గత భద్రత వ్యవస్థ కనిపెట్టిందని, ఆధార్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో ఆధార్ వివరాల భద్రతకు సంబంధించి వదంతులు వ్యాపించాయని, దీంతో యూఐడీఏఐ స్పందించినట్లు తెలిపింది. ఐరిస్, వేలిముద్రలను, బయోమెట్రిక్లను మార్చడం, దుర్వినియోగం చేయడం ఆధార్ చట్టం కింద శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తామని అధికారులు వివరించారు. సమాచార నిల్వకు, ట్రాన్స్మిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ టెక్నాలజీని యూఐడీఏఐ వినియోగించిందని చెప్పారు. ఏడేళ్లుగా సమాచారం బయటకు వచ్చినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. సైబర్ దాడి నుంచి రక్షణ పొందడం కోసం యూఐడీఏఐ ఎప్పటికప్పుడు భద్రతను పటిష్టం చేసుకుంటుందన్నారు.