మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత దేశంలో డిజిటల్ ట్రాంజాక్షన్లు తప్పనిసరి అవసరంగా మారాయి. ఆ క్రమంలో పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా వీటిని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వాలు కూడా సులభంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా కొన్ని ప్లాట్ ఫాంలు కల్పించాయి. అందులోభాగమే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్). అంటే... ఆధార్ సంఖ్య ఆధారంగా మనీ ట్రాన్సఫర్ అన్నమాట. తొలుత ఇది పెద్దగా వర్కవుట్ అయ్యేలా కనిపించలేదు కానీ, గణాంకాలు చూస్తే ఇది బాగా సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. నగదు కొరత తీవ్రంగా ఉన్న కాలంలో దీనివినియోగం 6 రెట్లు పెరిగిందట.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఇది ఎంతో అనువైన టెక్నాలజీ అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సీఈఓ హోతా చెప్తున్నారు. పాస్ వర్డులు, ఓటీపీ వంటివాటిపై పెద్దగా అవగాహన లేని గ్రామీణులకు ఇది మంచి ఆప్షన్ అన్నది ఆయన అభిప్రాయం. 2016 అక్టోబరు నుంచి 2017 ఏప్రిల్ మధ్య దీని వినియోగదారులు ఏకంగా 6 రెట్లు పెరగడమే దీనికి గల ఆదరణను చెప్తోందని ఆయన అంటున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడానికి నెల రోజుల ముందు గత అక్టోబరులో ఏఈపీఎస్ వాడేవారు కేవలం 10 లక్షల మంది ఉండగా ఈ ఏప్రిల్ నాటికి వారి సంఖ్య 60 లక్షలకు చేరింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మైక్రో ఏటీఎంల సహాయంతో ఈ ట్రాంజాక్షన్లు జరుగుతాయి. ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకైనా ఈ విధానంలో నగదు బదిలీ చేసుకోవచ్చు. వచ్చే రెండేళ్లలో భారత్ లోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ పే విధానాన్ని మరింతగా స్ప్రెడ్ చేయాలని భావిస్తున్నారు.