భారత్లో ఒకప్పుడు సీడీఎంఏ ఫోన్లదే హవా. ఎవరి చేతిలో చూసినా సీడీఎంఏ ఫోన్లే. రిలయన్స్ ఫోన్లు వచ్చాక అదో విప్లవంలా నడిచింది భారత్లో సీడీఎంఏ వ్యాపారం. చాలామంది ఈ ఫోన్లను ఉచితంగా వాడి పారేసినవాళ్లు కూడా ఉన్నారు. దీనిలో సిమ్ కార్డు వేసుకునే అవకాశం లేకపోవడమే ఒక కారణం. ఒకప్పుడు వెలుగు వెలిగిన సీడీఎంఏ ఫోన్లు ఇకపై కనిపించావా? మన దేశంలో ఈ ఫోన్ల వాడకం ఇక ఉండదా!
రోజు రోజుకు తగ్గుముఖం
స్మార్ట్ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సీడీఎంఏ ఫోన్లను వాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం భారత్లో సీడీఎంఏ ఫోన్లను వాడే వారి సంఖ్య 12.59 మిలియన్లుగా ఉంటే ఆ సంఖ్య డే బై డే తగ్గగుముఖం పడుటోంది. నిజానికి 2011 జూన్ నాటికి భారత్లో సీడీఎంఏ వాడకం దారుల సంఖ్య 114 మిలియన్లుగా ఉండేది. అంటే ఆరేళ్ల వ్యవధిలో ఆ సంఖ్య 12.59 మిలియన్లుగా పడిపోయిందంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ మే నాటికి భారత్లో ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య సుమారు 1.2 బిలియన్గా ఉంటే వారిలో ఎక్కువ శాతం మంది జీఎస్ఎం సర్వీసులు ఉపయోగిస్తున్నవారే.
హ్యాండ్సెట్స్ దొరకట్లేదు
భారత్లో సీడీఎంఏ ఫోన్లు ఇంత వేగంగా పడిపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది స్మార్ట్ఫోన్ విప్లవం. ప్రతి ఒక్కరూ వాట్సప్, ఫేస్బుక్లను తమ ఫోన్లలోనే ఉపయోగించాలని అనుకుంటున్నారు. ఫోన్ అంటే కేవలం కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు బహుళార్థ సాధకంగా ఉపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే సీడీఎంఏ ఫోన్లతో ఇవన్నీ సాధ్యం కాదు. అందుకే ఎవరూ వీటివైపు మొగ్గు చూపట్లేదు. తక్కువ రేటు ఉన్నా ఎవరూ కొనట్లేదు. కొంచెం వయసు మళ్లిన వాళ్లు ఈ ఫోన్లకు బాగా అలవాటుపడ్డవాళ్లు, టెక్నాలజీ అంటే ఇష్టం లేని వాళ్లు మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాక భారత్లో సీడీఎంఏ హ్యాండ్సెట్ల పరికరాలు దొరకకపోవడం కూడా వీటి తగ్గుదల వెనుక ప్రధాన కారణం.