ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు, బ్యాంకింగ్ వ్యవహారాలకు, చెల్లింపులకు డిజిటల్ ప్లాట్ ఫాంలను ఉపయోగించుకోవడం గత ఏడాది కాలంలో భారీగా పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత వినియోగదారులు బ్యాంకింగ్ అలవాట్లను ఎంతగా మార్చుకున్నారో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇనిస్టిట్యూట్(ఎఫ్ఎస్ఐ) మూడో వార్షిక ఫర్ఫెర్మాన్స్ అగైనెస్ట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ (పీఏసీఈ) నివేదిక ప్రకారం 60శాతం మంది డిజిటల్ ట్రాంజాక్షన్లు చేస్తున్నారు. వీరంతా తమ బ్యాంకు ఖాతా బ్యాలెన్స్, ఇటీవలి లావాదేవీలు చూసుకునేందుకు, బిల్లులు చెల్లించేందుకు, ఫండ్స్ బదిలీ లేదా ఇతర బ్యాంకింగ్ అవసరాలకుగాను ఈ ఏడాది తాము తమ మొబైల్ ఉపకరణాలను ఉపయోగించినట్లు వెల్లడించారు.
కాగా 2016లో వీరి సంఖ్య 39శాతంగా, అంతకుముందు ఏడాది 2015లో వీరి సంఖ్య 34 శాతమే ఉంది. భారతదేశంలోని బ్యాంకులు ఇతర దేశాలలోని తమ పోటీదారులతో పోలిస్తే, ఖాతాదారుల అంచనాలను అందుకోవడంలో తగ్గుస్థాయిలోనే పనిచేస్తాయని కూడా ఎఫ్ఐఎస్ పేస్ నివేదిక వెల్లడించింది. 2017 పేస్ అధ్యయనంలో భారతీయ ఆర్థిక సంస్థలు 75 పాయింట్లు స్కోర్ చేశాయి. ఇది 2016లో సాధించిన దానికంటే కూడా ఒక పాయింట్ ఎక్కువే అయినప్పటికీ, అంతర్జాతీయ సగటు పేస్ స్కోర్ కంటే ఏడు పాయింట్లు తక్కువ.
* సర్వేకు స్పందించిన వారిలో కనీసం 18శాతం మంది తమ ప్రాథమిక బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను విస్తృతంగా వినియోగించారు.
* నగదు, చెక్ లేదా క్రెడిట్ / డెబిట్ కార్డులతో పోలిస్తే తమ చెల్లింపుల్లో 30శాతానికి మించి మొబైల్ యాప్స్ ద్వారానే అవుతున్నట్లుగా సర్వేలో తెలిపారు.
* ఏ సమయంలోనైనా, ఎక్కడి నుంచైనా తమ బ్యాంకులతో మెరుగైన విధంగా అనుసంధానం కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.
2017 ఎఫ్ఐఎస్ పీఏసీఈ-భారతదేశం, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, థాయ్లాండ్, యునైటెడ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఎనిమిది దేశాల్లో 8 వేల మంది బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే వినియోగదారులను సర్వే చేసింది. ఎఫ్ఐఎస్ సర్వే జరిగిన ఇతర రీజియన్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులు ముందున్నారు.