ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా సైట్లలో ఫేస్బుక్, ట్విటర్ ముందుంటాయి. అయితే ఈ రెండు సైట్లను జనం సక్రమంగా వినియోగిస్తున్నారా? అసలు ఈసైట్లలో ఏం జరుగుతోంది? ఎవరు ఎఫ్బీ, ట్విటర్లు ఎక్కువగా వాడుతున్నారు. అయితే తాము ఎక్కువశాతం సమాచారాన్ని తెలుసుకోవడానికో లేక సమాచారాన్ని షేర్ చేయడం కోసమో సోషల్ మీడియా సైట్లను వాడుతున్నామని చెప్పే వారి మాటే ఎక్కువ ఉంటుంది. కానీ వాస్తవంగా చూస్తే ఈ రెండు సైట్ల ద్వారా తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు బాగా ప్రాచుర్యం పొందున్నాయట! ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యూహంలో భాగం కావడమే.
తొమ్మిది దేశాల్లో శోధన
ఫేస్బుక్, ట్విటర్ ఎక్కువగా ఉపయోగించే తొమ్మిది పెద్ద దేశాల్లో నిర్వహించిన పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా ప్రభుత్వాలు తమ పథకాల గురించో లేక తాము చేయబోయే మంచి పనుల గురించి ప్రచారం చేసుకుంటాయి. ఒకప్పుడు కరపత్రాల ద్వారానో లేక పత్రికలు, టీవీల ద్వారానో ఈ ప్రచారం జరిగేది. కానీ మారిన కాలానికి తగ్గట్టే ప్రభుత్వాలు కూడా మారాయి. అయితే ఆ మార్పు ప్రమాదకరంగా ఉండడమే ఆందోళన కలిగించే అంశం. ఎక్కువ దేశాల్లో ప్రభుత్వాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలోనే ఉన్నాయట. దీనికి ఫేస్బుక్, ట్విటర్లను బాగా వాడుకుంటున్నాయట. భారత్లో మాత్రమే కాదు మిగిలిన పెద్ద దేశాల్లో ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుందని పరిశోధనలో తేలింది.
బురద రాజకీయాల కోసం..
భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన మతాలు, భిన్నమైన కులాలు, అంతకంటే భిన్నమైన మనుషులు, మనస్తత్వాలు ఉన్న భారత్ లాంటి దేశం ఇలాంటి ప్రచారాలు మామూలే అనుకున్నా.. కమ్యూనిస్ట్ దేశాలైన రష్యా, చైనా లాంటి వాటిలోనూ ఇలా తప్పుడు ప్రచారాలు, ప్రజలను నమ్మబలికే ప్రోపగాండా నడవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రభుత్వంలోని పెద్దల పేర్లతో తప్పుడు అకౌంట్లను క్రియేట్ చేసి ఆ అకౌంట్ల కింద పోస్టింగ్స్ పెట్టి, లైక్, షేర్, కామెంట్ అంటూ ప్రోత్సహించడం మామూలైపోయింది. అన్నిటికంటే దారుణ విషయం ఏమిటంటే మాతాలను, కులాలను కించపరుస్తూ పోస్టింగ్స్ తరుచూ షేర్ కావడం. ఇలాంటి పోస్టింగ్స్కు అడ్డకట్ట వేయడానికి ఎఫ్బీ, ట్విటర్ ఎంత ప్రయత్నిస్తున్న ఉపయోగం ఉండడం లేదు. ఫేక్ అకౌంట్లను ఎన్ని ఏరివేస్తున్నా మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి.