• తాజా వార్తలు

‘జియో ఫోన్’ ఒక విధ్వంసకర ఆవిష్కరణ: కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు ‘జ్ఞానతేజ’

    రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ రోజు ప్రకటించిన ‘జియో ఫోన్’ టెలికాం రంగంలో మరో విప్లవాన్ని సృష్టించింది. భారతదేశ డిజిటల్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఉచిత 4జీ వీఓఎల్టీఈ సేవలు తొలి  విప్లవమైతే... ఇప్పుడు 100కు పైగా స్మార్టు ఫీచర్లతో 4జీ ఫీచర్ ఫోన్ ను ఉచితంగా అందించనుండడం రెండో విప్లవమని చెప్పాలి. 
    ముకేశ్ అంబానీ ప్రకటనపై టెలికాం రంగ నిపుణులు, సాంకేతిక రచయితలు, విశ్లేషకులు, బ్లాగర్లు.. ఎవరికివారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తొలి తెలుగు సాంకేతిక మాస పత్రిక ‘కంప్యూటర్ విజ్ఞానం’ వ్యవస్థాపకులు, సంపాదకులు అయిన ‘జ్ఞానతేజ నిమ్మగడ్డ’ కంప్యూటర్ విజ్ఞానంతో మాట్లాడారు. తాజా ఆవిష్కరణను విధ్వంసకర ఆవిష్కరణగా ఆయన అభిప్రాయపడ్డారు. 
    ‘‘ఈ నిర్ణయం మన దేశంపై చూపించే ప్రభావాన్ని అసలు ఊహించలేం. ఇప్పటివరకు జియో ఉచిత 4జీ డాటాతో స్మార్టు ఫోన్లు వాడేవారికే ప్రయోజనాలు దక్కాయి. ఇప్పుడు 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ల యూజర్లే లక్ష్యంగా ముకేశ్ తీసుకొస్తున్న ఈ ఫోన్ దేశంలోని ప్రతి వ్యక్తికీ డిజిటల్ లైఫ్ అందించడం ఖాయం. ఇప్పటికే ఇండియా సాగిస్తున్న డిజిటల్ ప్రయాణంలో వేగాన్ని ఇది ఒక్కసారిగా పెంచుతుంది.  డిజిటల్ ఇండియా ప్రస్థానానికి ఇది రాకెట్ వేగం అందిస్తుంది’’ అని చెప్పారు.

ఫోన్ల తయారీ సంస్థలకు షాకింగ్ న్యూస్
‘‘4జీ ఉచిత వీఓఎల్టీఈ సేవలతో దేశంలోని టెలికాం సంస్థలన్నిటినీ డిఫెన్సులోకి నెట్టేసి... వినియోగదారులకు కూడా మేలు కలిగేలా చేసిన జియో టెలికాం రంగంలో పెను సంచలనాలకు నాంది పలికింది. అదంతా గత కొద్దినెలలుగా చూస్తున్నదే. ఇండియా టెలికాం చరిత్రను, ప్రస్థానాన్ని చెప్పుకొంటే ‘జియోకు ముందు... జియో తరువాత’ అని చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఈ జియో ఫోన్ ప్రకటనతో కొత్తగా ఫోన్ల తయారీ సంస్థలకు భయం మొదలైంది. ఫీచర్ ఫోన్లను తయారుచేసే సంస్థలు, స్మార్టు ఫోన్ మేకర్లు, దేశీయ మొబైల్ మాన్యుఫ్యాక్చరర్లు, విదేశీ దిగ్గజ సంస్థలు అన్నిటికీ ఇది పెద్ద షాకింగ్ న్యూసే’’నని జ్ఞానతేజ అభిప్రాయపడ్డారు. ఈ ఫోన్ ద్వారా ప్రపంచానికి వినియోగదారులకు కనెక్ట్ చేయడం ఒక్కటే కాకుండా ముకేశ్ భారతదేశం మొత్తానికి కనెక్ట్ అవుతున్నారని.. దీర్ఘకాలంలో ఇది అందరికీ అర్థమవుతుందని అన్నారు.

‘‘వ్యాపార వ్యూహాల్లో ముకేశ్ ప్రపంచంలోని దిగ్గజ వ్యాపారవేత్తలను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మీడియా మొఘల్స్ గా పిలిచే బిలియనీర్స్ రూపర్ట్ మర్దోక్, టెడ్ టర్నర్ల జీవిత చరిత్రలు చదివిన వారికి ముకేశ్ ఎటు తీసుకెళ్తున్నారన్నది అర్థమవుతుంది’’ అని జ్ఞానతేజ పేర్కొన్నారు.
 

జన రంజకమైన వార్తలు