తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో వివాహం చేసుకొని, ఒక్కటవ్వాలనుకునే జంటలకు మరింత వెసులుబాటు కలుగుతోంది. ఆన్లైన్లో కల్యాణవేదిక స్లాట్ను బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకోవచ్చు.
టిటిడి సేవా ఆన్లైన్.కామ్ వెబ్సైట్లో కల్యాణవేదిక ఆప్షన్ లో వరుడు, వధువు వివరాలు నమోదు చేయాలి. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక ఓటర్, ఆధార్ కార్డులలో ఏదో ఒక గుర్తింపుకార్డును అప్లోడ్చేయాలి. వయసు ధ్రువీకరణ కోసం బర్త్ సర్ట్ఫికెట్ లేదా పదోతరగతి ట్రాన్స్ఫర్ సర్ట్ఫికెట్ లేదా మార్కుల జాబితా లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా పాన్కార్డు లేదా పాస్పోర్ట్ వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహతేదీ, సమయాన్ని వారే నిర్ణయించుకొని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది.
ఆ అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని తీసుకొని ముహూర్తానికి 6 గంటల ముందు తిరుమల చేరుకొని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి. అనంతరం వారికి పురోహితుడు, మంగళవాయిద్యాలతో పాటు వసతి గృహాన్ని కేటాయిస్తారు. పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణాలను టిటిడి ఉచితంగా అందిస్తుంది. వీటితోపాటు 10 చిన్న లడ్డూలను ఉచితంగా ఇస్తారు. వివాహానికి కావాల్సిన ఇతర సామగ్రిని మాత్రం వధూవరులే తీసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు కారణమేంటే చెప్పగలగాలి.