కొద్దికాలం కిందట స్మార్టు ఫోన్లలో క్రేజీ ఫీచర్ గా వచ్చిన ఫింగర్ ప్రింటు సెన్సార్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సుమారుగా అన్ని ఫోన్లలో ఈ ఫీచర్ ఉంటోంది. అయితే... ఈ పీచర్ ఎంతో కాలం మనుగడ సాగించబోదని, దీని కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేస్తుందని టెక్ వర్గాలు అంచనాలు వేశాయి. ముఖ్యంగా దిగ్గజ సంస్థ టచ్ ఐడీ విషయంలో పరిశోధనలు చేస్తుండడంతో యాపిల్ కొత్త ఫోన్లలో ఆ ఫీచర్ వస్తే ఫింగర్ ప్రింటు సెన్సార్ల అవసరం పోతుందని భావించారు. అదే సమయంలో శాంసంగ్ కూడా అలాంటి పరిశోధనలే చేయడంతో ఆ సంస్థ ఫ్లాగ్ షిప్ పోన్ గెలాక్సీ ఎస్ 8లోనే ఆ పీచర్ తెస్తారని భావించారు. కానీ... అదేమీ జరగలేదు. ఇప్పుడు నోట్ 8లో టచ్ ఐడీ ఫీచర్ ఉంటుందంటున్నారు.
యాపిల్ కంటే ముందు..
అయితే... యాపిల్, శాంసంగ్ ల కంటే ముందుగానే మరో సంస్థ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న ఫోన్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన చైనా సంస్థ వివో నుంచి ఈ టెక్నాలజీ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఓ టెక్నాలజీ బ్లాగులో దర్శనమిచ్చాయి.
స్క్రీన్ పై వేలితో టచ్ చేస్తే గుర్తిస్తుంది
వివో అతి త్వరలో లాంచ్ చేయబోతున్న ఓ ఫోన్లో ఈ ఫీచర్ ఉందట. స్క్రీన్ పై వేలితో టచ్ చేయగానే అది ఫింగర్ ప్రింట్లను గుర్తించి అన్ లాక్ అవుతుంది. ఇతరులెవరైనా ప్రయత్నిస్తే అన్ లాక్ కాదు. అయితే, వివోకు అంత సీనులేదని యాపిల్ కానీ, శాంసంగ్ కానీ ముందుగా ఇలాంటి ఫోన్ రిలీజ్ చేస్తాయని అనేవారూ ఉన్నారు. కానీ.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8లోనే ఈ పీచర్ తేవాల్సిన శాంసంగ్ ఈ ఫీచర్ విషయంలో ఇంకా పర్ఫెక్షన్ సాధించకపోవడంతో ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే శాంసంగ్ నుంచి ఆశించలేం అంటున్నారు. మరోవైపు వివో ఈ ఫోన్ ను వచ్చే నెలలోనే లాంచ్ చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వివోకు చాలా ఫస్టులున్నాయి...
పైగా వివో గత రికార్డులు మామూలుగా లేవు. గతంలో వివో పలు ఫీచర్లను, ప్రత్యేకతలను ఫస్ట్ టైం తానే ఇంట్రడ్యూస్ చేసిన విషయం మర్చిపోకూడదు. నాలుగేళ్ల కిందట కేవలం 5.75 ఎంఎం థిక్ నెస్ ఉన్న ఫోన్ ఎక్స్ 3ను వివో లాంచ్ చేసింది. తొలి అత్యంత పలుచని ఫోన్ అదే. అలాగే ఆ తరువాత ఎక్స్ ప్లే 5 పేరుతో మరో ఫోన్ విడుదల చేసింది. ప్రపంచలోనే తొలి 6జీబీ ఫోన్ అదే. ఇన్ని తొలి రికార్డులున్న వివో ఇప్పుడు కూడా టచ్ ఐడీ విషయంలో తానే రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి.