తైవాన్ కంపెనీ హెచ్ టీసీ ఇటీవలే యు11 పేరిట ఒక స్మార్టు ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ ప్రత్యేకత కూడా తెలిసే ఉంటుంది. తొలి స్వ్కీజబుల్ ఫోన్ అది. అంటే ఆ ఫోన్ ను పట్టుకుని ఒత్తితే చాలు అందులో యాప్స్ , కెమేరా వంటి ఫీచర్లు పనిచేస్తాయి. దీనికి ఎడ్జ్ సెన్స్ టెక్నాలజీ అన్న పేరు కూడా పెట్టారు. యూజర్లు ఫోన్ పట్టుకునే తీరును ఆధారంగా డిజైన్ చేసిన ఈ టెక్నాలజీకి మంచి ఆదరణే కనిపిస్తోంది. దాంతో హెచ్ టీసీ ఇప్పుడు మిడ్ రేంజి ఫోన్లలోనూ ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. త్వరలో ఓషియన్ లైఫ్ పేరిట రిలీజ్ చేయనున్న ఫోన్లో ఈ టెక్నాలజీ ఉంది.
ఎడ్జ్ సెన్స్ టెక్నాలజీ ఉంటే ఫోన్ సైడ్స్ లో సెన్సార్లు ఉంటాయి. ఫోన్ పక్క భాగాలను నొక్కి ఫోన్ లాక్, అన్లాక్ చేసుకోవడం, యాప్స్ ఓపెన్ చేయడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు. అంతేకాదు, దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఫోన్ సైడ్ ప్యానల్ లోనే అమర్చుతారని తెలుస్తోంది. అయితే.. ఫీచర్లన్నీ బాగున్నా బ్యాటరీ మాత్రం 2600 ఎంఏహెచ్ మాత్రమే ఉండడంతో బ్యాకప్ ఎలా ఉంటుందన్నది అనుమానమే.
ఇవీ స్పెసిఫికేషన్లు
* 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్
* 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 7.1 నూగట్
* 16 మెగాపిక్సల్ రియర్, ఫ్రంట్ కెమెరాలు
* 4జీ వీవోఎల్టీఈ, యూఎస్బీ టైప్ సి పోర్టు
* 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.