రిలయన్స్.. ఇది ఇప్పుడు పేరు కాదు ఒక వ్యాపార మంత్రం. ఆ సంస్థ దాదాపు ప్రవేశించని రంగం లేదు. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయడానికి రిలయన్స్ ప్రయత్నిస్తోంది. మొబైల్ రంగంలో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ ఈసారి క్యాబ్ రంగంలోకి బరిలో దిగనుందట. భారత్లో కొత్త ఒరవడి నెలకొల్పిన ఓలా, ఉబర్లకు పోటీగా రిలయన్స్ క్యాబ్స్ను సీన్లోకి తీసుకు రావడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే త్వరలోనే మనం రోడ్లపై రిలయన్స్ క్యాబ్లను చూడొచ్చు.
600 కార్లు ఆర్డరిచ్చేశారు
ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇప్పటికే క్యాబ్ వ్యాపారంపై గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా 600 కార్లను ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చిందంట రిలయన్స్. ఈ ఏడాది ఆఖరికి ఈ క్యాబ్ సర్వీసులు మొదలు కానున్నాయని సమాచారం. అయితే ఈ క్యాబ్ సర్వీసులు ఎప్పుడు లాంఛ్ అవుతున్నాయనే విషయం రిలయన్స్ టెలికాం సర్వీసుల మీద ఆధారపడి ఉంటుంది. జియో టెలికాం, జియో ఫోన్ల విషయంలో ఇప్పడిప్పుడే కుదురుకుంటున్న రిలయన్స్ క్యాబ్ల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని.. సమయం చూసి లాంఛ్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఒక్కసారి మార్కెట్లోకి దిగితే తిరిగి వెనుదిరిగి చూసుకునే పని లేకుండా అన్ని హంగులతో ఈ క్యాబ్ సర్వీసులను లాంఛ్ చేసేందుకు రిలయన్స్ వ్యూహ రచన చేస్తోంది.
తక్కువ ఫేర్తో..
రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఇదో పెద్ద సంచలనం. ఎందుకంటే తక్కువ ధరలతో డేటా ఇస్తూ మిగిలిన సంస్థలకు పెద్ద షాకే ఇచ్చింది. అంతేకాదు ఫీచర్ ఫోన్ దాదాపు ఉచితంగా అంటూ సంచలనానికి తెర తీసింది. ఇప్పుడు క్యాబ్ల విషయంలోనూ ఆ సంస్థ అదే ఫార్ములాను ఫాలో కాబోతుంది. ప్రస్తుతం ఉబెర్, ఓలా సంస్థలు ఫేర్ విషయంలో పోటీపడుతున్నాయి. తక్కువ ఫేర్ ఇవ్వడం పక్కన పెడితే సర్జ్ పేరుతో ఎక్కువే వసూలు చేస్తున్నాయి. జనం కూడా వీటికి అలవాటుపడిపోయారు. రాబోయే రిలయన్స్ క్యాబ్లు వీటికి భిన్నమట. తక్కువ ఫేర్లతో ప్రయాణీకులను ఆకట్టుకోవడమే తమ లక్ష్యమని రిలయన్స్ చెబుతోంది. కొన్ని రోజులు ఉచితంగా సర్వీసులు అందించే ఆలోచనలో కూడా ఉందని సమాచారం. మరి ఈ క్యాబ్ ఎప్పుడు వస్తాయో.. ఎలాంటి సంచలనం సృష్టాస్తాయనేది ఆసక్తికరం.