మనం ఎంతో ఖర్చు పెట్టి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తాం. మనకు కావాల్సిన ఫీచర్లు ఉన్న ఫోన్ దొకినప్పుడు ఒక్కోసారి డబ్బులు కూడా లెక్క చేయకుండా ఫోన్ కొనేస్తాం. అయితే ఇంత డబ్బులు పోసి ఫోన్లను కొన్నా... మన చేతులోకి వచ్చిన కొన్ని రోజులకే ఏదైనా ప్రమాదవశాత్తూ కింద పడడమో లేక ఏదైనా వాటర్లో పడడమో జరిగితే! మన గుండె గుభేల్ మనడం ఖాయం. ఎందుకంటే మనం ఏం వాడకుండానే ఆ ఫోన్ పాడైతే అలాగే ఉంటుంది. దీంతో వెంటనే సర్వీస్ సెంటర్కు పరిగెడతాం. అక్కడ వాడు స్పేర్ పార్ట్ల కోసం చెప్పే బిల్ చూసి మరోసారి మనకు గుండె గుభేల్ మంటుంది. ఎందుకంటే ఒక్కోసారి స్పేర్ పార్ట్ల ధరలు ఫోన్ కాస్ట్ అంత ఉంటాయి కాబట్టి. ఇప్పుడు భారత్లో జియోమి ఫోన్ల విషయంలో ఇదే పెద్ద ప్రాబ్లమ్గా మారింది.
రెండింటికి ఎంత తేడా!
జియోమి ఫోన్ను కొనుగోలు చేసిన తర్వాత చాలామంది కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అది పొరపాటు కిందపడి స్క్రీన్ పగలడం, డిస్ప్లే పోవడం లేదా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఎదుర్కోవడం లాంటి సమస్యలొచ్చాయి. అయితే వీటిని బాగు చేయించడం కోసం జియోమి సర్వీస్ సెంటర్కు వెళ్లిన వినియోగదారులకు షాక్ ఎదురైంది. ఎందుకంటే పాడైపోయిన పార్ట్ల స్థానంలో కొత్త పార్ట్లు వేయాలంటే భారీగా ఖర్చు అవుతుండడమే దీనికి కారణం. జియోమి మాత్రమే కాదు వన్ ప్లస్ ఫోన్ల విషయంలోనూ ఇదే అనుభవం కస్టమర్లకు ఎదురైంది. భిన్నమైన మాన్యుఫాక్చర్ల నుంచి వచ్చిన పార్ట్లు కావడంతో ఒక్కోదానికి ఒక్కో రేటు ఉంటుంది. దీని వల్ల మనకు సర్వీసు ఖర్చు కూడా బాగా పెరిగిపోతోంది. అదే మనం బయట ఎక్కడైనా కోఠి, కరోల్బాగ్, జాఫర్ మార్కెట్ లాంటి చోట్ల ఈ పార్ట్లను వేయిస్తే సగం కంటే తక్కువే ఖర్చు అవుతుంది.
ఇన్సురెన్స్ కావాలి..
రెడ్ మి 4 డిస్ప్లే ఖరీదు అఫీషియల్గా రూ.2632 ఉంటే.. కరోల్బాగ్ మార్కెట్లో రూ.1400 మాత్రమే లభ్యం అవుతోంది. మెయిన్ బోర్డ్ 64 జీబీ ధర రూ.599 గా ఉంటే బయట మాత్రం రూ.350కే వచ్చేస్తుంది. ఎంఐ మాక్స్ 1 డిస్ప్లే ధర రూ.4999గా ఉంటే... బయట రూ. 1400 మాత్రమే. రెడ్మి నోట్ 4 డిస్ప్లే రూ.2499గా ఉంటే.. బయట మార్కెట్లో రూ.1300కే లభ్యం అవుతుంది. అంటే అఫిషీయల్కి అన్ అఫీషియల్కి ఎంతో తేడా. ఈ ధరలను భరించలేక జనాలు కూడా అన్ అఫీషియల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇవి ఎంత కాలం ఉంటాయో చెప్పలేని స్థితి. వీటిని నివారించాలంటే ఫోన్ల కంపెనీలు కచ్చితంగా ఇన్సురెన్స్ వారెంటీ పాలసీ ఇవ్వాలి. ఏమైనా పార్ట్లు పోయినప్పుడు మనకు ఉచితంగానో లేదా తక్కువ ధరకే అందించాలి. అప్పుడు మాత్రమే వినియోగదారులకు జరిగే నష్టం తగ్గుతుంది.