షియోమి అనగానే.. మనకు విజయవంతమైన ఫోన్ల జాబితానే కనిపిస్తుంది. ముఖ్యంగా రెడ్మి సిరీస్ మన దేశంలో సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఒకదశలో భారత్లోనే ఎక్కువ అమ్ముడుపోయే సిరీస్గా ఇది పేరు సంపాదించింది. అయితే అదే షియోమి మరో కొత్త ఫోన్ను రంగంలోకి దింపింది. అదే రెడ్మి నోట్ 5. కొత్త ఏడాదిలో కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి దిగిన ఈ ఫోన్ వినియోగదారులకు పక్కా నచ్చి తీరుతుందని ఆ సంస్థ గట్టి విశ్వాసంతో ఉంది. మరి ఈ కొత్త ఫోన్లో ఉన్న ఫీచర్లేమిటో చూద్దామా...
రూ.9999 ధరకే...
సాధారణంగా షియోమి ఫోన్లు రీజనబుల్ ధరలకే లభ్యం అవుతాయి. రెడ్మి సిరీస్ అంతగా హిట్ కావడానికి కారణం అదే. తక్కువ ధర.. మంచి ఫీచర్లు!! ఇదే ఆ సంస్థ విజయసూత్రం. అందులో భాగంగానే రెడ్మి నోట్ 5 వచ్చేసింది. ఇది కూడా బడ్జెట్ ఫోనే. రూ.9999కే ఈ ఫోన్ను అందిస్తోంది షియోమి. ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి బడ్జెట్ ఫోన్ ఇదే. అంటే ఆ సంస్థ బడ్జెట్ ఫోన్ అంటూ ఇంట్రడ్యూస్ చేసిన తొలి ఫోన్ ఇదే. 5.99 ఫుల్ హెచ్డీ స్క్రీన్తో దీని లుక్ అదిరిపోతోంది. రెడ్మి నోట్ 4లాగా ముందు భాగంలో కాపిటేటివ్ బటన్స్ లేవు దీనిలో.
ఫింగర్ప్రింట్ సెన్సార్
బడ్జెట్ ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్లు తక్కువే. కానీ రెడ్మి నోట్ 5లో మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కీలకమైంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీంతో మీకు సెక్యూరిటీకి ఇలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ రూ.12 వేల ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటోంది. కానీ రెడ్మి తన కొత్త ఫోన్లో ఈ ఫీచర్ ఇన్క్లూడ్ చేసింది. యూఎస్బీ టైప్ 2.0 ఛార్జింగ్ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్సెట్ దీనిలో ఉన్న మరో ఫీచర్లు. కెమెరా కూడా అద్భుతంగానే ఉంది ఈ ఫోన్లో. కలర్ రీప్రొడెక్షన్ ఆప్షన్ వల్ల మీకు ఫొటోలు నాచురల్గా వస్తాయి.
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1
దీనిలో ఉపయోగించి ఓఎస్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1. ఈ ఫోన్లో కాస్త నిరాశ కలిగించే అంశం ఇదే. ఎందుకంటే కొత్త వెర్షన్లతో ఫోన్లు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఆండ్రాయిడ్ నౌగట్ వెర్షన్ వాడడమే ఆశ్చర్యం కలిగించే అంశం. ఐతే దీన్ని త్వరలో అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు షియోమి చెబుతోంది. ఈ ప్రాబ్లమ్ను షియోమి ఎంతవరకు సాల్వ్ చేస్తుందో చూడాలి. కనీసం ఆండ్రాయిడ్ ఓరియోకు అప్గ్రేడ్ అయితే వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.