ప్రపంచాన్ని ఏలుతున్న టెక్ సంస్థల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి గూగుల్, మైక్రోసాప్ట్, ఫేస్బుక్లే. ఫేస్బుక్ కంటే ఎంతో ముందు నుంచి కంప్యూటర్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాయి గూగుల్, మైక్రోసాఫ్ట్. వీటి ఆదాయం మన ఊహకు అందదు. వద్దన్నా డబ్బులు వచ్చి పడుతూనే ఉంటాయి. అందుకే ప్రపంచ ధనికుల్లో ఈ రెండు సంస్థల అధిపతులు కూడా ఉన్నారు. అయితే ఇంత పెద్ద సంస్థలను నడిపించాలంటే సీఈవోలు చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా ఆయా సంస్థల ఆపరేషన్స్ నిర్వహణలో వీరిదే కీలకపాత్ర. అందుకే సమర్థలైన సీఈవోల కోసం బడా కంపెనీలు ఎంత పెద్ద మొత్తమైనా వెచ్చిస్తాయి. వారికి సకల సదుపాయాలు కల్పిస్తాయి. ఒక్క మాటలో చెప్పలంటే రాజాలా చూస్తాయ్. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ సీఈవో మన భారతీయుడే. సుందర్ పిచాయ్ సీఈవోగా ఆ సంస్థను నడిపిస్తున్నాడు. మరి పిచాయ్ నెలకు సంపాదించే జీతం ఎంతో చెప్పగలరా? కనీసం సంవత్సరానికి అతని టేక్హోం అంచనా వేయగలరా? అతనే కాదు చాలా మంది సీఈవోలకు కళ్లుచెదిరే శాలరీలు ఇచ్చి సంస్థలను నడిపిస్తున్నాయి టెక్ దిగ్గజాలు. మరి అలాంటి కొంతమంది సీఈవోల జీతాలు ఎలా ఉన్నాయో చూద్దామా!
సుందర్ పిచాయ్ (గూగుల్)
భారత్కు చెందిన సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా ఎంపిక కావడమే ఒక సంచలనం. దశాబ్దానికి పైగా ఈ సంస్థలో ఉద్యోగిగా ఉన్న పిచాయ్కి భారీగా జీతం ఇచ్చి సీఈవోగా నియమించింది గూగుల్. 2015లో ఏడాదికి 6 లక్షల 52 వేల డాలర్లను శాలరీగా పొందిన పిచాయ్.. 2016 ఏడాదిలో 6 లక్షల 50 వేలు సంవత్సరానికి గడించాడు. అంతేకాదు అతని సారథ్యంలో ఎన్నో అద్బుత ఫలితాలు సాధించినందుకు గూగుల్ అతని కాంపెన్సేషన్ కింద మరో 200 మిలియన్ డాలర్లు నజరానా ఇచ్చింది.
సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)
భారత్కే చెందిన సత్య నాదెళ్ల కూడా ఎక్కువ శాలరీ తీసుకుంటున్న సీఈవోల జాబితాలో ఉన్నారు. గతేడాది ఆయన ఏడాదికి 18 మిలియన్ డాలర్ల ప్యాకెజ్ రూపంలో తీసుకున్నారు. ఈ ఏడాది కాంపెన్సేషన్ రూపంలో 17.7 మిలియన్ డాలర్లు ఆయన అందుకున్నారు. ఈ ఏడాది ఆఖరికి ఆయన జీతం మరింత పెరిగే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
టిమ్ కుక్ (యాపిల్)
యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ కూడా బాగానే జీతం గడిస్తున్నాడు. ఆయన గతేడాది 8 మిలియన్ డాలర్లు శాలరీగా అందుకున్నాడు. కుక్ యాపిల్ కంపెనీకి ఏడో సీఈవో. 1998లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కంపెనీలో చేరిన కుక్ ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ సీఈవో స్థానానికి చేరాడు. అతని హోదాతో పాటు శాలరీ కూడా భారీగా పెరిగింది.
మార్క్ జుకెర్బర్గ్ (ఫేస్బుక్)
పిన్నవయసులోనే ఫేస్బుక్ను ప్రపంచానికి పరిచయం చేసి బిలీనియర్ అయిపోయాడు మార్క్ జుకర్బర్గ్. ఫేస్బుక్ సీఈవోగా ఆయన ప్రస్థానం ఆశ్చర్యం కలిగించేదే. కేవలం ఫేస్బుక్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు మార్క్. 2004లో తన స్నేహితుడు సెవిరన్ తోడుగా ఫేస్బుక్ను లాంఛ్ చేసిన జుకర్బర్గ్ తన ఆదాయాన్ని వేగంగా పెంచుకున్నాడు. 2012లో ఒక మిలియన్ యూజర్ల మార్క్ చేరుకుంది. ఎఫ్బీలో మార్క్కు 426.3 మిలియన్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ 25.68 బిలియన్లుగా ఉంది.
జాక్ డోర్సె (ట్విటర్)
సోషల్ మీడియాలో టాప్లో ఉన్న కంపెనీల్లో ట్విటర్ ఒకటి. ఇలాంటి కంపెనీకి సీఈవోగా ఉంటే సంపాదన ఏ స్థాయిలో ఉంటుంది. జాక్ డోర్సెని చూస్తే తెలిసిపోతుంది. 2015లో ట్విటర్ సీఈవోగా నియమితుడైన డోర్సె వ్యక్తిగతంగా ఎలాంటి శాలరీ తీసుకోడు. కానీ పర్సనల్, రెసిడెన్షిల్ సెక్యూరిటీ కింద అతనికి కంపెనీ 68,506 డాలర్లు ఇచ్చింది.