ఇప్పుడు నడుస్తోంది డిజిటల్ పేమెంట్ విధానం! భారత ప్రభుత్వమే ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డిజిటల్ లావాదేవీలు జరగాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆశిస్తోంది. కొన్ని సంవత్సరాల్లోనే భారత్ పూర్తి స్థాయి డిజిటల్ దేశంగా మారుతుందని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలే కాదు సోషల్ మీడియా కూడా డిజిటల్ రంగంపై దృష్టి పెట్టింది. అందరి స్మార్ట్ఫోన్లలో తప్పక ఉండే వాట్సప్ కూడా పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దానికి సంబంధించిన ప్రకటన కూడా చేసింది. ఐతే వాట్సప్కు పోటీగా మరో సోషల్ మీడియా సంస్థ హైక్ కూడా డిజిటల్ పేమెంట్ మెథడ్ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. సోషల్ మీడియాలో అందరికంటే ముందు తానే పేమెంట్ సిస్టమ్ను ప్రవేపెట్టి మార్కులు కొట్టేయాలని ఆ సంస్థ భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియలను కూడా హైక్ వేగవంతం చేసింది.
యూపీఐ బేస్డ్ ఫ్లాట్ఫాం
భారత్లో డిజిటల్ పేమెంట్స్ విధానం ఊపందుకున్న నేపథ్యంలో ఇక్కడ పాగా వేయాలని హైక్ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే పేటీఎం, ఎయిర్టెల్ మనీ, జియో మనీ లాంటి డిజిటల్ యాప్లు అందుబాటులో ఉన్నా.. ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోవాలని హైక్ భావిస్తోంది. యూపీఏ బేస్డ్ ఫ్లాట్ఫాం ద్వారా నెమ్మదిగా డిజిటల్ చెల్లింపులు విస్తరింపజేయాలనేది ఈ సోషల్ మీడియా సంస్థ ఆలోచన. కేంద్ర ప్రభుత్వ చెల్లింపుల విధానం యూపీఐకు అనుబంధంగా ఒక డిజిటల్ చెల్లింపుల యాప్ను ప్రవేశపెట్టాలని హైక్ అనుకుంటోంది. ఒక మెసేజింగ్ యాప్ ద్వారా చెల్లింపులు చేయడం భారత్లో అదే ప్రథమం అవుతుంది. పీర్ టు పీర్ పద్ధతిలో నగదు బదిలీలను చేయడం ఈ యాప్ ప్రత్యేకత. మొబైల్ రీఛార్జుల దగ్గర నుంచి బిల్లలు చెల్లింపుల వరకు అన్ని లావాదేవీలను తమ యాప్ ద్వారా చేసుకోవచ్చని హైక్ చెప్పింది.
బ్యాంకులతోనూ ఒప్పందం
యూపీఐ ద్వారా అనుసంధానం కావడం మాత్రమే కాదు.. నగదు లావాదేవీలను సరళతరం చేయడానికి భారత్లోని బ్యాంకులతో ఒప్పందం చేసుకోవాలని హైక్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ బ్యాంకుతో హైక్ చర్చలు సాగిస్తోంది. కార్డుల నుంచి మనీ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవడానికి, తిరిగి బ్యాంకుకు మనీ పంపడం లాంటి లావాదేవీలను ఈజీ చేయడం కోసం హైక్ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఆరు నెలల్లో భారత్లో పూర్తి స్థాయిలో ఈ పేమెంట్ యాప్ను విడుదల చేయాలనేది ఈ చైనా కంపెనీ సంకల్పం. ప్రస్తుతం హైక్కు భారత్లో 200 మిలియన్ల
యూజర్ బేస్ ఉంది. వారందరిని ఆకర్షించి తమ డిజిటల్ యాప్ వైపు తిప్పుకుంటే వాట్సప్ను దెబ్బ కొట్టేచ్చానేది ఆ సంస్థ వ్యూహం.