లీగల్ నోటీస్... చాలామందికి ఇదొక ఆట. కొంతమందికి కంగారు. చాలామంది లీగల్ నోటీస్ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. సాధారణంగా డోర్ లాక్ ఉంటే ఆ నోటీస్ తిరిగొచ్చేస్తుంది. లేకపోతే తీసుకోవడానికి నిరాకరించిన రిజెక్ట్ అవుతుంది. దీని వల్ల ఏ కేసూ ముందుకు సాగదు. తప్పు చేసినవాళ్లు మాత్రం హాయిగా ఉంటారు. లీగల్ నోటీస్ అందుకుంటే వెంటనే స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కోర్టు ధిక్కరణ నేరం కింద వారికి శిక్ష పడడం ఖాయం. అందుకే చాలామంది తెలివిగా నోటీసులు తీసుకోకుండా తప్పించుకుంటూ ఉంటాయి. అయితే టెక్నాలజీ ఇంత పెరిగాక కోర్టులు కూడా ఆ సాంకేతికతను వాడుకుని ఇలాంటి వాళ్ల ఆటలు కట్టించాలని నిర్ణయించుకున్నాయి. అంటే ఇది వరకులా కాకుండా కోర్టు నోటీసులు మనం ఎవరికి పంపాలనుకున్నామో వారి వాట్సప్కు అందుతాయి. వాళ్లు ఆ నోటీసులు చూసినట్లు బ్లూ గీతలు వస్తే చాలు నోటీసులు అందుకున్నట్లే లెక్క.
దిల్లీ హైకోర్టుతో మొదలు..
వాట్సప్కు లీగల్ నోటీసులు పంపితే వాటిని అధికారికంగా గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది దిల్లీ హైకోర్టు. వాట్సప్ మాత్రమే కాదు ఈమెయిల్ను కూడా లీగల్ నోటీస్లను పంపడానికి వాడుకోవచ్చని ఈ కోర్టు తెలిపింది. ఒక ఆస్తి తగాదా విషయంలో ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. తన బంధువులు ఎన్ని నోటీసులు పంపినా లెక్క చేయట్లేదని కనీసం వాటిని తీసుకోవట్లేదని దీని వల్ల కోర్టు విచారణ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుందని అతను కోర్టుకు విన్నవించాడు. దీంతో వారి వాట్సప్ నంబర్కు లీగల్ నోటీసులు పంపాలని కోర్టు అతనికి తెలిపింది. ఏ ఒక్కరు నోటీసులు చూసినా వెంటనే రెస్పాండ్ అవ్వాలని చెప్పింది. అంటే వాట్సప్లో మనం పంపిన ఏ మెసేజ్ అయినా అవతలి వాళ్లు చదివితే వెంటనే బ్లూ టిక్ వస్తుంది. బ్లూ టిక్ వచ్చిందంటే వారు లీగల్ నోటీసులు అందుకున్నట్లేనని కోర్టు తెలిపింది.
స్క్రీన్షాట్ ముఖ్యం
మనం ఎవరికైనా వాట్సప్ ద్వారా లీగల్ నోటీసులు పంపితే వాటిని వారు తీసుకున్నారని చెప్పడానికి రుజువు ఆ నీలం రంగు గీతలే. అయితే వాటిని అవతల వ్యక్తి గుర్తించే ఏమైనా చేసేలోపే మనం జాగ్రత్తపడాలి. వెంటనే ఆ మెసేజ్ వరకు స్క్రీన్షాట్ తీసుకుని పెట్టకుంటే మనం రుజువులు సబ్మిట్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే మనం ఎన్ని రకాలైన మాయలు చేసైనా తప్పు నుంచి తప్పించుకోవచ్చేమో కానీ టెక్నాలజీకి దొరికితే అంతే. మనం చేసిన ప్రతి చర్య టెక్నాలజీ ద్వారా రికార్డు అయితే అది అలాగే ఉండిపోతుంది. కోర్టు కేసుల్లో ఇదే కీలకమవుతుంది.