ఈ సాంకేతిక ప్రపంచంలో ఫేస్బుక్ వాడని వాళ్లు ఉండరు. ఇప్పుడు పల్లెటూళ్లో సైతం ఫేస్బుక్ని విరివిగా వాడేస్తున్నారు. అయితే ఫేస్బుక్ వాడకం దారులకు తెలియని కొన్ని విషయాలు లోలోపలే జరిగిపోతున్నాయి. మనకు పోయేదేముంది అనుకుంటున్నారా?.. పోయేది మన డేటానే అండీ బాబూ! ఏ మాత్రం ఆదమరిచినా మన విలువైన డేటా గల్లంతు కావడం ఖాయం. కాకపోతే మనం ఎంతగానో నమ్మే.. అన్ని విషయాలు షేర్ చేసుకునే ఫేస్బుక్ మన డేటా మీద నిఘా పెట్టడం మనం నమ్మలేని నిజం.
యాడ్స్ కోసమేనా..
ఫేస్బుక్ రన్ అయ్యేది యాడ్స్ మీదే. ప్రకటనల ద్వారానే ఆ సంస్థకు వేల కోట్ల డబ్బులు సమకూరుతాయి. అయితే ఈ యాడ్స్ కోసం ఎఫ్బీ వినియోగదారులను టార్గెట్ చేసుకుందని ఐటీ నిపుణులు అంటున్నారు. అంటే మన డేటా ఆధారంగా యాడ్స్ను ప్లేస్ చేయడం కోసం ఫేస్బుక్ మన ప్రతి యాక్టివిటీపై కన్నేసిందనేది వారి మాట. నిజానికి ఇది ఎప్పటినుంచో ఉన్న అనుమానమే కానీ. ఇప్పుడు నిజమని తేలింది. అంటే దాదాపు గూగుల్, యూట్యూబ్ ఫార్ములానే ఫేస్బుక్ కూడా ఫాలో అవుతోంది. అంటే మనం జస్టిస్ లీగ్ అనే కామిక్ సినిమా గురించి వెతికితే వెంటనే మనకు కామిక్ బుక్స్ గురించి యాడ్స్ చూపిస్తుంది ఫేస్బుక్.
డైలీ లైఫ్ను సెర్చ్ చేసి..
మన ఇష్టాలు, మన కదలికలు, మన కోరికలు అన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా యాడ్స్ను ప్లేస్ చేయడానికి ఫేస్బుక్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా మనం షేర్ చేసి డేటాతో పాటు వీడియోలు, మన కామెంట్స్, మనకు వేరే వాళ్లు ఇచ్చిన కామెంట్స్ ఇలా అన్నింటి మీద నిఘా వేసిందని సమాచారం. అంతేకాదు మన కన్వర్షేషన్ల మీద కూడా ఎఫ్బీ ఒక కన్నేసి ఉంచిందట. మైక్రోఫోన్ల ద్వారా కస్టమర్లు మాట్లాడుతున్న మాటల్ని పసిగట్టడం కోసం ఎఫ్బీ ప్రత్యేకంగా కొంతమందిని నియమించందని సమాచారం. అయితే దీనిపై కస్టమర్లు చాలా గుర్రుగా ఉన్నారు. ఎఫ్బీ వెంటనే ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టకపోతే వారి మనుగడకే ప్రమాదమని నేరుగా తమ పోస్టుల ద్వారా నిరసన తెలియజేస్తున్నారు.