ఫేస్బుక్, వాట్సాప్, స్కైప్, వీచాట్, గూగుల్ టాక్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సర్వీసులపై ఒక నియంత్రణ వ్యవస్థ ( రెగ్యులేటరీ సిస్టం)ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకు చెప్పింది. టెలికం ఆపరేటర్లపై నియంత్రణ కోసం టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)ను ఏర్పాటు చేసినట్లే ఈ ఓటీటీ సర్వీసులపైనా రెగ్యులేటరీ సిస్టంను తీసుకొస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ను పాటించేలా వీటిపై ఎలాంటి రెగ్యులేషన్లు లేకపోవడంతో కస్టమర్ ప్రైవసీని పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ పడింది. దీనికి డీవోటీ సమాధానమిస్తూ ఓటీటీ సర్వీసులపైనా రెగ్యులేటరీ సిస్టంను తీసుకురాబోతున్నామని చెప్పింది.
ఓటీటీలు టెలికం సర్వీస్ ప్రొవైడర్లను ఉపయోగించుకుని కస్టమర్లను చేరతాయి. యాప్ బేస్డ్ ప్రొడక్ట్లను ఆఫర్ చేస్తాయి. ఫోన్, మెసేజ్ సౌకర్యాలను ఇస్తూ టెలికం ప్రొవైడర్లకు కాంపిటీషన్ అవుతున్నాయి. ఇన్ని చేస్తున్నా వీటిపై ఎలాంటి నియంత్రణం లేదనేది టెలికం డిపార్ట్మెంట్ వాదన. వాట్సాప్లో వచ్చే మెసేజ్ల ప్రైవసీపై ఆ సంస్థ పట్టించుకోవడం లేదని, ఇది యూజర్ల ప్రైవసీకి ప్రమాదమని కర్మణ్యా సింగ్ శరణ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సర్వీసులపై నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. వాట్సాప్లో పంపుకునే ప్రైవేటు మెసేజ్లకు ప్రైవసీ లేదని.. ఇది ఆ యూజర్ ప్రైవసీ హక్కుతోపాటు వాక్ స్వాతంత్ర్యపు హక్కుకు కూడా భంగం కలిగిస్తుందన్నారు. వాట్సాప్ తదితర ఓటీటీ సర్వీసుల తరపున కేసు వాదిస్తున్న ఫేమస్ లాయర్, మాజీ సెంట్రల్ మినిస్టర్ కపిల్ సిబల్ దీన్నికొట్టిపారేశారు. వాట్సాప్లో మెసేజ్లకు ప్రైవసీ లేదనే సమస్యే రాదని, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండడం వల్ల ఆ మెసేజ్లను వాట్సాప్ కూడా చదవలేదని సుప్రీంకోర్టుకు చెప్పారు. దీనిపై ఈ నెల 18న మరోమారు విచారణ జరగనుంది.