ఫేస్బుక్ లైట్ వెర్షన్ గురించి తెలుసు కదా... ఇప్పడు ట్విటర్ కూడా అదే బాటలో నడుస్తోంది. వినియోగదారుల సౌకర్యం కోసం తాను కూడా లైట్ వెర్షన్ తీసుకొచ్చింది ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థ. సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ ఉన్నడివైజ్లలో ఫేస్బుక్, ట్విటర్ లాంటి ఎక్కువ స్టోరీజ్ పట్టే యాప్లు ఇమడలేవు. ఒకవేళ ఏదో విధంగా వీటిని డౌన్లోడ్ చేసుకున్నా... ఆ డివైజ్ అప్డే్ట్ అయినప్పుడు మళ్లీ స్టోరేజ్ సమస్య వస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఫేస్బుక్ ఇప్పటికే లైట్ వెర్షన్ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ట్విటర్ కూడా లైట్ బాటలో నడిచింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వారిని దృష్టిలో ఉంచుకుని ఈ లైట్ వెర్షన్ను అందుబాటులోకి తెచ్చినట్లు ట్విటర్ చెప్పింది. సులభంగా డౌన్లోడ్ కావడమే కాదు సులభంగా ఉపయోగించుకునే వీలుండే ఈ వెర్షన్ వల్ల ట్విటర్ వాడే వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందనేది ఆ సంస్థ అంచనా.
యునైటెడ్ స్టేట్స్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ లైట్ వెర్షన్ ప్రవేశపెట్టినట్లు ట్విటర్ తెలిపింది. ఐతే ఇది యాప్లా ఉపయోగపకుండా.. వెబ్ బ్రౌజర్ నుంచి ఉపయోగపడుతుందని చెప్పింది. వాట్సప్తో సమానమైన అనుభూతిని ఈ కొత్త వెర్షన్ ఇస్తుందని ట్విటర్ పేర్కొంది. 2015లో ఫేస్బుక్ కంపెనీ లైట్ వెర్షన్ను ప్రవేశపెట్టగా.. ఇటీవలే యూ ట్యూబ్ కూడా లో డేటా మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. దీని వల్ల తమ కంపెనీ ఎక్కువమందికి చేరువుతుందని యూట్యూబ్ భావిస్తోంది. ప్రస్తుతం ట్విటర్కు నెలవారీ 319 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉండగా.. ఫేస్బుక్కు మాత్రం 1.9 బిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్బీకి చేరువగా వచ్చేందుకు ట్విటర్ ప్రయత్నాలు చేస్తోంది.
భారత్ లాంటి దేశాల్లో తమకు రోజు రోజుకు వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఫీచర్లను అందుబాటులకి తీసుకురావాలని ట్విటర్, యూ ట్యూబ్ భావిస్తున్నాయి. ఇండియన్ ప్రిమియర్ లీగ్, ఇతర మేజర్ ఈవెంట్లు జరిగినప్పుడు ట్విటర్, యూట్యూబ్ వాడకం భారీగా ఉండడంతో ఆ వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు ఈ రెండు దిగ్గజ సంస్థలు నడుం బిగించాయి. 1.3 బిలియన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించాయి. భారత్తో పాటు ఇండోనేసియా, అర్జెంటీనా, మెక్సికో తదితర దేశాలపై దృష్టి పెట్టాయి.