కాలం మారింది... కట్టు బానిసత్వం పోయినా పనికట్టుకుని బానిసలుగా మారుతున్నవారు ఎక్కువవుతున్నారు. ఈ బానిసత్వం ఇతరుల వద్ద కాదు, స్మార్టు ఫోన్ల వద్ద చేస్తున్నారు. అధికంగా సెల్ఫోన్ను ఉపయోగిస్తే వ్యక్తిగతంగానే కాకుండా ఉద్యోగ నిర్వహణలో, సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు వస్తున్నాయని తెలుస్తున్నా కూడా దీన్నుంచి బయటపడలేకపోతున్నారు. 182 మంది కళాశాల విద్యార్థుల నుంచి రోజువారీ స్మార్ట్ఫోన్ వాడకంపై నివేదిక రూపొందించిన ఓ పరిశోధక బృందం వాటిని పరిశీలించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
సోషల్ మీడియా బానిసలు
స్మార్ట్ఫోన్కు బానిసలైనవారు సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం, ఎల్లప్పుడు స్నేహితులతో చాటింగ్ చేస్తుండడం, ఆన్లైన్ షాపింగ్, వీడియో గేమ్స్, అశ్లీల చిత్రాలను చూడటం వంటి వాటికి గంట కొద్దీ సమయాన్ని వినియోగిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. అటువంటి వారు ఒత్తిడికి, సామాజిక ఆందోళనకు గురవుతున్నారని, సిగ్గు, ఆత్మన్యూనతా భావాలకు లోనవుతున్నారని పరిశోధనలో తెలిసింది.
అవసరానికి మించి..
ఫోన్ వాడే వారిని పలు వర్గాలుగా పరిశోధన బృందం విభజించింది. స్మార్ట్ఫోనుపై మోజు కలిగిన వారు, బానిసైపోయినవారుగా వర్గీకరించి ఇందులో 7 శాతం మంది ఫోనుకు బానిసైపోయినవారు ఉన్నారని తెలిపింది. ఇక 12 శాతం మంది మోజులో ఉన్నవారని తెలిపింది. వారి వ్యక్తిగత జీవితంలో పాటు అటు సమాజంలో, ఇటు కార్యాలయాల్లో వారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తేల్చింది. వారిలో అధికశాతం మంది మహిళలే ఉండడం గమనార్హం. ఇటువంటి అలవాట్ల బారిన పడితే ఫోన్ రింగ్ అయినా కాకపోయినా తరుచూ దాన్ని చూసుకుంటుంటారని, ఫోన్ దగ్గరలేకపోతే ఏదో కోల్పోయినట్లు భావించే వారు నిపుణులను కలవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.