భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ మార్కెట్ వల్ల, ఆండ్రాయిడ్, ఐఓయస్ డెవలపర్స్కు డిమాండ్ అనేక రెట్లు పెరగనుందని తాజా నివేదిక తెలియజేస్తోంది. ఇండియన్ మొబైల్ టాలెంట్ 2016 నివేదిక ప్రకారం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఉద్యోగాలిచ్చే కంపెనీల్లో ఇప్పటికీ ఐటీ కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఐటీ కంపెనీల నుంచి బయటకు వచ్చిన వారిలో 53% మొబైల్ కంపెనీల్లో చేరుతున్నారు. ఇలా చేరిన 53%లో 37%మంది ఇంటర్నెట్ , సాస్, ఈ కామర్స్ సిగ్మెంట్లలోనే పని చేస్తున్నారు. దేశంలో మొబైల్ వినియోగం పెరగడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు నాటకీయంగా పెరిగిపోయాయి. కొత్త ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సొమ్ము చేసుకొనేందుకు కొత్త కొత్త మొబైల్ యాప్లు కనిపెట్టడం ఒక పోటీగా మారింది. ఇది ఆండ్రాయిడ్, ఐఏయస్లలో నిపుణులైన వారికి మంచి ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అయితే ఇండియాలో మొబైల్ యాప్ డెవలప్మెంట్ సిగ్మంట్ ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉందని సర్వే వెల్లడించింది. ఐటీ రంగంలో పని చేసే వారికే అత్యధికంగా వేతనాలు లభిస్తున్నాయి, ఆ తర్వాత స్థానంలో ఈ కామర్స్ రంగం ఉంది. మొబైల్ యాప్ డెవలప్మెంట్ కంపెనీలో పని చేసే యువత సుమారు ఒకటిన్నర సంవత్సరాలకు ఉద్యోగం మార్చేస్తున్నారని కూడా సర్వే వెల్లడిస్తుంది. సాధారణంగా ఒక కొత్త మొబైల్ యాప్ రూపొందిచడానికి 18నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేయడం, మెయిటెయిన్ చేయడం వంటి పనులే ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందాలనుకొనే యువతరాన్ని కొత్త యాప్ల తయారీ ఆకర్షించినంతగా సపోర్టింగ్ పనులు ఆకర్షించకపోవడం కూడా ఉద్యోగాలు మారడానికి కారణం కావచ్చు అని సర్వే పేర్కొంది. ఐటికి సంబంధించిన వ్యవహారాలన్నీ డెస్క్ టాప్లూ, లాప్టాప్ల నుంచి మొబైల్స్ లోకి మారిపోతున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్, ఐఓయస్ నిపుణులకు డిమాండ్ వేగంగా పెరుగుతుందని సర్వే సూచించింది. |