జాబ్ కు అప్లయి చేయాలంటే బయోడేటా రాసివ్వడం పాత పద్ధతి. ఇప్పుడు రెజ్యుమ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. భవిష్యత్తులో దాని అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రిక్రూట్ చేసుకునేటప్పడు ఎంప్లాయర్స్ సీవీలు, పాత కంపెనీల పని చేసినప్పుడు ఎలా ఉన్నారు? ఆ యజమాని గురించి చెడుగా చెబుతున్నారా ఇలాంటివన్నీ చూసి క్యాండిడేట్ ను అంచనా వేసేవారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ లోనూ టెక్నాలజీ ఇంపార్టెన్స్ పెరుగుతోంది. కాండేట్ సెలెక్షన్స్లో ట్రెడిషినల్ సీవీ, ఇంటర్వ్యూల ప్రభావం తగ్గుతోందని, భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగు కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆన్లైన్లో మీరు ఏదైనా ఆఫీస్ పని చేసినప్పుడు మీ డిజిటల్ సిగ్నల్స్ను ట్రేస్ చేసి వాటి ద్వారానే మీ పనితీరును, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివన్నీ అంచనా వేసే ఏర్పాట్లు ముందు ముందు రాబోతున్నాయి.
ఈ రోజుల్లో ప్రతి మెయిల్, ఇన్స్టంట్ మెసేజ్, ఫోన్ కాల్, ఆఖరికి మీ మౌస్ క్లిక్ కూడా ఒక డిజిటల్ సిగ్నల్ ను క్రియేట్ చేస్తాయి. ఈ పాట్రన్స్ను కలెక్ట్ చేసి వాటిని ఎనలైజ్ చేయడం ద్వారా మీరు ఎలా పని చేస్తారు. మీ పనితీరు, కమ్యూనికేషన్స్ విధానం ఎలా ఉంటుంది, అవి తమ సంస్థకు ఎలా పనికొస్తాయని ఎంప్లాయర్ అంచనా వేస్తారు.
నాక్ అండ్ టాలెంట్ బిన్ వంటి ఆర్గనైజేషన్లు కంపెనీలకు ఈ తరహా డిజిటల్ సిగ్నల్స్ సమాచారాన్ని అందజేస్తున్నాయి. అంటే ఈ డాటా ద్వారా కంపెనీలు డిజైరబుల్ క్యాండేట్నే నేరుగా ఎంచుకోగలుగుతాయి. రెజ్యెమెల అవసరం ముందు ముందు అంతగా ఉండకపోవచ్చు. అత్యధిక మంది ఉద్యోగుల పని డిజిటల్ రూపంలోనే ఉంటోంది. వారి పని చేసినది హార్డ్ డిస్క్లోనో, డ్రాప్ బాక్స్లోనో ఎక్కడో ఒకచోట స్టోరయి ఉంటుంది. దాన్ని విశ్లేషిస్తే ఆ ఎంప్లాయ్ పనితీరు, యాటిట్యూడ్ను అంచనా వేయొచ్చుఅని టాలెంట్ బిన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ కజాంజీ చెప్పారు.
దీనివల్ల ఫలానా పనిలో నిపుణుడైన వ్యక్తి ఫలానా ప్రాజెక్టుకు సూటబుల్ అని కంపెనీలు ముందే ఒక అంచనాకు రావడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే గతంలో మాదిరిగా కంపెనీలు ఒకే ఎంప్లాయిని జీవితకాలం పాటు అట్టిపెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎంప్లాయిస్ కూడా మెరుగైన ఛాన్స్ వస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు కొత్తవారిని అపాయింట్ చేసుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అప్లికేషన్లు ఆహ్వానించడం, వాటిని ఫిల్టర్ చేసి, డిజైరబుల్ క్యాండేట్ను సెలెక్ట్ చేసి అతణ్ని ఇంటర్వ్యూ చేయడం ఇదంతా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే లింకిడిన్ వంటి ఓపెన్ ప్లాట్ఫాంలలో అభ్యర్థులు తమ క్వాలిఫికేషన్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వాటిని చూసి ఎంప్లాయర్ తనకు కావాల్సిన క్యాండేట్ను సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు.
లింకిడిన్ మైక్రోసాఫ్ట్ హస్తగతం వెనుకా ఇదే మతలబు
మైక్రోసాఫ్ట్ కంపెనీ గత జూన్లో 26 బిలియన్ డాలర్లు పెట్టి లింకిడిన్ను కొనేసింది. మైక్రోసాఫ్ట్ లాంటి లెజండరీ కంపెనీ కేవలం సీవీలు, రెజ్యుమెలు ఉంచే ఓ ఆన్లైన్ ప్లాట్ఫారంను ఎందుకంత ధర పెట్టి కొనుక్కుంది? సమాధానం కూడా చాలా సింపుల్. తన వద్ద అభ్యర్థులు ఎప్పటికప్పడు అప్డేట్ చేసిన వారి విద్యార్హతలు, ఉద్యోగ సామర్థ్యాల వివరాలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మడం ద్వారా లింకిడిన్ ఏటా మూడు బిలియన్ డాలర్లు సంపాదిస్తుంది. అదీకాక లింకిడిన్ లో నమోదైన అభ్యర్థులు తమ దగ్గరున్న సమాచారాన్ని, అర్హతలు, కొత్తగా తాము నేర్చుకున్న కోర్సులు, లాంగ్వేజ్లు వంటివన్నీ ఎప్పటికప్పడు ఒకరితో ఒకరు షేర్ చేస్తుంటారు. ఈవివరాలన్నీ మైక్రోసాఫ్ట్ తనకున్న ఎంటర్ప్రైజస్ సాఫ్ట్వేర్ ద్వారా కావల్సినవారికి అమ్ముకోవచ్చు.
పర్మినెంట్ ఉద్యోగాలుండవు..
ప్రైవేటు సెక్టార్ విస్తృతి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏ ఉద్యోగమూ పర్మినెంట్గా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఒక కాంట్రాక్ట్ నుంచి మరో కాంట్రాక్ట్కు ఎంప్లాయి ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతూనే ఉండాల్సిన పరిస్థితి మరింత పెరిగిపోతోంది. పార్ట్టైం, షార్ట్ టర్మ్, కాంట్రాక్ట్ బేస్డ్ ఇలా కొలువుల తీరు మారిపోతుంది. మన దగ్గర ఓ మాదిరిగానే ఉన్న ఈ తీరు ప్రపంచదేశాల్లో మాత్రం చాలా వేగంగా ముందుకెళుతోంది.
ఎంప్లాయిమెంట్ డేటాలో మార్పు ఇప్పటికే కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో 2010 తర్వాత వచ్చిన కొలువుల్లో సగానికి పైగా షార్ట్ - టర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలే. ఆస్ట్రేలియాలో 2013 తర్వాత మూడింట రెండు వంతుల జాబ్లు పార్ట్టైంవే. యూఎస్లో 40% ఉద్యోగులు కంటింజెంట్వే. ఈ నేపథ్యంలో రెజ్యూమ్లతో పని లేకుండా ఎంప్లాయిస్ను సెలెక్ట్ చేసుకోవడానికి కంపెనీలు లింకిడిన్ వంటి సర్వీసుల పైనే ఆధారపడుతుండడం ఈ రంగంలో వస్తున్న కొత్త మార్పు.. స్వాగతించడం తప్పనిసరి.