యూట్యూబ్ అందరికి ఇష్టమైన సోషల్ మీడియా ఫ్లాట్ఫాం. కోట్లాది వీడియోలు నిక్షిప్తం చేసుకున్న ఈ దిగ్గజ సైట్ను ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తుంటారు. ఏ చిన్న పని చేయాలన్నా యూట్యూబ్ తీసేవాళ్లు కోకొల్లలు. అయితే యూట్యూబ్ను కేవలం వీడియోలు చూడటానికే పరిమితం చేయకుండా దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. భారత్లో ఈ సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రాంక్ వీడియోలు, సాహస వీడియోలు, వంటల వీడియోలు ఒకటేమిటి ఈ వీడియోలకు హద్దు పద్దు లేదు. ఐతే ఈ వీడియోల ద్వారా సంపాదించాలంటే మాత్రం గూగుల్ యాడ్స్ తప్పని సరి.
దీని కోసం చాలామంది మోనిటేజేషన్ చేసుకుంటారు. ఐతే మోనిటేజేషన్ చేసుకోవాలంటే ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానెల్కు ఎలాంటి వ్యూస్ ఉండాల్సిన అవసరం లేదు. యాడ్ సెన్స్ సైన్ అప్ చేసి నేరుగా మోనిటైజేషన్ చేసుకోవచ్చు. కానీ యూట్యూబ్ ఇకపై నిబంధనలను మార్చనుంది. 10 వేల వ్యూస్ ఉంటేనే మోనిటైజేషన్ ద్వారా వీడియోలకు యాడ్స్ పెట్టకునే అవకాశం కల్పిస్తామని చెప్పింది. 10 వేల వ్యూస్ మార్క్ దాటాక... కంటెంట్ను నిశితంగా పరిశీలించిన తర్వాతే మోనిటైజేషన్ అవకాశం కల్పిస్తున్నట్లు యూట్యూబ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇకపై వీడియోలపై డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్లకు ఇకపై కష్టమే.
వీడియోలు వైరల్గా మారి వేగంగా వ్యూస్ వస్తే తప్ప అంత సులభం కాదు. చెత్త వీడియోలపై మోనిటైజ్ చేద్దామనుకునే వారికి కచ్చితంగా ఇది మంచి వార్త కాదు. దురుద్దేశ పూర్వక కంటెంట్ పెట్టడం, వివాదాస్పద కామెంట్లతో వీడియోలను నింపడం, సంచలనం కలిగించే హెడ్డింగ్స్ పెట్టడం లాంటివి చేసే వారికి ఇక చెల్లుచీటినే.అలాంటి కంటెంట్ను నిరోధించడానికి తాము ఇకపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు, అబ్యూజివ్ కంటెంట్ కనబడితే వెంటనే ఆ చానెల్పై నిషేధం విధిస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. ఐతే 10,000 వ్యూస్ నిబంధన ఇప్పటికే మోనిటైజ్ చేసుకున్న వారికి వర్తించదని చెప్పింది.