• తాజా వార్తలు

జియో బ్రాండ్ వేల్యూ ఫుల్లుగా వాడేస్తున్నారు

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలంటారు.. కానీ, ఎవరో వెలిగించిన దీపంతో ఇంకెవరో ఇల్లు చక్కబెట్టుకుంటూ మరింత తెలివి తేటలు చూపిస్తున్నారు. రిలయన్స్ జియో పేరుకు ఉన్న పేరును ఫుల్లుగా వాడేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. అదెలాగో తెలిస్తే వారి తెలివితేటలకు నోరెళ్లబెట్టాల్సిందే.
ఫ్రీ డాటా, ఫ్రీ వాయిస్ కాల్స్ తో దేశ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రంగా మారిపోయిన రిలయన్స్ జియో పేరు కనిపిస్తే చిన్న పిల్లలు కూడా జియో జియో అంటున్నారు. ఆ క్రేజ్ ను గుర్తించే జియో పేరుతో పలు వస్తువులను మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు. కాపీ రైట్, ట్రేడ్ మార్క్ వంటి నిబంధనలేమీ పట్టించుకోకుండా నిర్మొహమాటంగా, నిర్భయంగా అవే రంగుల్లో, అవే అక్షరాల్లో, అవే లోగోలతో సంచులు ముద్రించి అందులో సరకులు నింపేసి మార్కెట్లను ముంచెత్తుతున్నారు. ఉత్తరాదిలో అయితే గోధుమలు, రవ్వ, సబ్బులు, షాంపూలు వంటివి జియో పేరుతో వచ్చేశాయి.
తెలుగు రాష్ర్టాలూ తక్కువేం కాదు..
జియో బ్రాండ్ వేల్యూను క్యాష్ చేసుకోవడంలో తెలుగు రాష్ర్టాల వ్యాపారులూ ముందున్నారు. వీరు ఏకంగా జియో బ్రాండ్ నేమ్ తో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంత రైస్ మిల్లర్స్ 25 కిలోల బియ్యపు బ్యాగ్ లపై ‘జియో’ లోగోను ముద్రించి విక్రయిస్తున్నారు. ఒక్క రామగుండమే కాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ జియో రైస్ బ్యాగులు కనిపిస్తున్నాయి. అటు ఏపీలోనూ అక్కడక్కడా జియో రైస్ కనిపిస్తోంది.
నెటిజన్ల సెటైర్లు..
అయితే.. ఈ రైస్ బ్యాగులపై నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ చిత్రాలపై మంచి మంచి కామెంట్లు పెడుతన్నారు. జియో రైస్ మొదటి మూడు నెలలు ఫ్రీ అని కొందరు... ఒక్క రోజు తింటే 3 నెలల వరకు ఆకల వేయదని ఇంకొందరు.. ఇలా జియో ఆఫర్లతో ముడి పెట్టి సెటైర్లు వేస్తున్నారు.

జన రంజకమైన వార్తలు