• తాజా వార్తలు

తెలంగాణ బస్సుల్లో కూడా ఉచిత వైఫై షురూ

తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వైఫై హబ్ గా మారనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో రైల్వేస్టేషన్లు, హుస్సేన్ సాగర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఫ్రీగా వైఫై సేవలు అందిస్తుండగా అదికాస్తా ఇప్పుడు సిటీలోని ఏసి బస్సుల్లో కూడా అందించనున్నారు. సిటీలోని ఏసి బస్సుల్లో త్వరలో ఈ ఉచిత  వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెల్లగా  మెట్రో ఎక్స్‌ప్రెస్‌లకు విస్తరించానున్నారు. మొదటి అరగంట ఉచితంగా, ఆ తరువాత తగిన రుసుము వసూలు చేయనున్నారు. హైదరాబాద్‌ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 29 పుష్పక్, వివిధ రూట్లలో నడిచే  80కి పైగా ఉన్న ఏసీ బస్సుల్లో  వైఫై  ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఉప్పల్ నుంచి  వేవ్‌రాక్ వరకు 2 మార్గాల్లో త్వరలో  ప్రయోగాత్మకంగా  వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను పరిశీలించిన అనంతరం  అన్ని ఏసీ  బస్సులకు వైఫై సేవలను విస్తరిస్తారు.  భవిష్యత్తులో మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో  కూడా  ఈ  సదుపాయాన్ని అం దుబాటులోకి రానుంది. ఇప్పటికే రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఆపితే లైసెన్సు, సీ బుక్ వంటివి చూపించే యాప్, షీ టీం యాప్ వంటివి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ‘హైదరాబాద్ మెట్రో బస్’ మొబైల్ యాప్ కూడా చేరనుంది. వెహికల్ ట్రాకింగ్,ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలో భాగంగా ‘హైదరాబాద్ మెట్రో బస్’ మొబైల్ యాప్ ద్వారా  ఏ బస్సు ఎక్కడ ఉందో  తెలుసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నారు. బస్టాపుల్లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లేబోర్డులపై  ఏ  బస్సు ఎక్కడ ఉందనే సమాచారం  ప్రదర్శిస్తారు. అలాగే  బస్సుల్లోనూ రాబోయే స్టేషన్ల ప్రదర్శనతో పాటు, అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంది. బెంగళూరు తరహాలో హైదరాబాద్ లో కూడా దీనిని అమలు చేయనున్నారు. 

 

జన రంజకమైన వార్తలు