టెలికం రంగంలో సంచలనాలు రేపుతున్న జియో తన 4జీ ఫీచర్ ఫోన్ను ఆగస్టు 15న తీసుకురాబోతోంది. 1500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కడితే ఈ ఫోన్ను ఫ్రీగా ఇస్తామని, వాయిస్ కాల్స్ ఫ్రీ అని, డేటాకోసం 153 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే చాలని జియో మాతృ సంస్థ రిలయన్స్ అధిపతి అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్లో జియో యాప్లు ప్రీలోడెడ్గా వస్తాయని చెప్పడంతో ఇది నెట్ న్యూట్రాలిటీని అపహాస్యం చేయడమేనని కొంతమంది వాదిస్తున్నారు. అయతే ఈ ఫోన్లో ఇతర యాప్లు వినియోగించకుండా కంట్రోల్ చేస్తుందో లేదో ఇంకా తెలియదు కాబట్టి దీనిపై ఇప్పుడే దీని గురించి కామెంట్ చేయలేమంటున్నారు మరికొందరు.
నెట్ న్యూట్రాలిటీ ఏంటి?
ఏ టెలికం కంపెనీ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కొన్ని సైట్లు మాత్రమే చూసేలా కంట్రోల్ చేయకూడదన్నది ట్రాయ్ రూల్. దీనికోసమే నెట్ న్యూట్రాలిటీని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం యూజర్లందరూ అన్ని రకాల కంటెంట్ చూడగలిగేలా ఉండాలి. అయితే జియో తన రాబోయే ఫీచర్ ఫోన్లో జియో యాప్స్ను ప్రీలోడెడ్గా తీసుకొస్తామని ప్రకటించింది. ఇది నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకమని దీన్ని సపోర్ట్ చేసేవాళ్లు అంటున్నారు. అయితే జియో ఫోన్లో ఇతర యాప్స్ను వాడుకోకుండా కంట్రోల్ చేస్తే మాత్రమే నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకమని, ప్రస్తుతానికి జియో దాని గురించి అలాంటిదేమీ చెప్పనందున నెట్ న్యూట్రాలిటీని వ్యతిరేకిస్తుందని చెప్పలేమని కోటాక్ ఇనిస్టిట్యూషన్ల్ ఈక్విటీస్ చెప్పింది. చాలా ఫోన్లు వాట్సప్, ఫేస్బుక్ వంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్తో వస్తున్నాయి. జియో కూడా అలాగే తన సొంత యాప్స్ను ఇన్స్టాల్ చేస్తుంది. అంతే తప్ప ప్రాథమికంగా జియో నెట్న్యూట్రాలిటీకి ఎలాంటి భంగం కలిగించే పరిస్థితి కనిపించడం లేదని సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్ కన్సెల్టెంట్ ప్రశాంత్ సుగాథన్ వివరించారు.
జియో ఏమంటోంది?
జియో ఈ కామెంట్స్పై ఏమీ వ్యాఖ్యానించలేదు. అయితే దానికి క్లోజ్గా ఉండే ఓ వ్యక్తి మాత్రం జియో.. నెట్ న్యూట్రాలిటీ ప్రిన్సిపల్స్ను వయొలేట్ చేయడం జరగని పని అని చెప్పారు. అంతేకాదు జియో ఫోన్తో జియోయాప్లో కాదు అన్ రెస్ట్రిక్టెడ్ ఇంటర్నెట్ యూసేజ్ చేసుకోవచ్చని స్పష్టంగా చెప్పారు.