భారత్లో మొబైల్ ఫోన్ల విప్లవం ప్రారంభం అయింది.. అసలు అందరికి మొబైల్ చేతిలోకి వచ్చింది రిలయన్స్తోనే అంటే అతిశయోక్తి కాదు. 2000 ఆరంభంలోనే దేశంలోని మొబైల్ రంగంలో రిలయన్స్ తెచ్చిన విప్లవం అసాధారణమైంది. సీడీఎంఏ ఫోన్లను చౌక ధరకు అందిస్తూ అందరిలో మొబైల్ ఫోన్ వాడకాన్ని పెంచిన ఘనత రిలయన్స్ సంస్థదే. మళ్లీ అదే రియలన్స్ ఇప్పుడు జియో రూపంలో ప్రకంపనలు రేపుతోంది. మొదట జియో డేటా ఆఫర్లతో విజృంభించిన ముఖేశ్ అంబానీ సంస్థ..ఇప్పుడు ఫీచర్ ఫోన్, కేబుల్ టీవీలతో దుమ్ము రేపుతోంది. వినియోగదారుల్లోకి చొచ్చుకెళుతోంది. అప్పుడు ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ తానే అని నిరూపించుకుంటోంది.
మిగిలిన టెలికాం సంస్థల పరిస్థితి!
జియో రాకతో భారత్లో టెలికాం సంస్థల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మరిపోయింది. మొదట ఉచితంగా డేటాను అందించిన జియో.. ఆ తర్వాత మూడు నెలలకు ఒక ప్లాన్ పెట్టి డేటాను అందించడంతో ఎయిర్టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎన్ లాంటి దిగ్గజ సంస్థలకు ఊపిరాడలేదు. ధనాధన్ ఆఫర్ ముగుస్తుందనగా మరో కొత్త సంచనల ప్రకటనతో ఇప్పుడు ఆ సంస్థల పరిస్థితి మరింత దిగజారడం ఖాయం. తాము ఈ ఏడాది బాగా నష్టపోయామని, తమపై పన్నుల భారం తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకొంటున్నాయి. ఇంతలోనే జియో ఫీచర్ ఫోన్, కేబుల్ టీవీ ప్రకటనలతో మిగిలిన సంస్థలు కూడా ఏదో ఒక ఆఫర్లు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక్కడితో ఆగదు
భారత్లో ఏకఛాత్రాధిపత్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జియో ఇప్పట్లో ఆగేలా లేదు. త్వరలో మరిన్ని ప్రకటనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. జియో ధనాధన్ ఆఫర్ ముగుస్తున్ననేపథ్యంలో రూ.399 ఆఫర్ ప్రకటించిన జియో మరో మూడు నెలల పాటు ఆ ఆఫర్ను పొడిగించింది. జియో నెట్ను కూడా వేగంగా విస్తరించి అందరి ఇళ్లలో జియో వైఫై హాట్స్పాట్లు ఉండేలా చేయడమే తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే జియో వైఫై హాట్స్పాట్లు అందజేస్తే కచ్చితంగా వినియోగదారులు తాము వాడుతున్న వైఫైని పక్కనపెట్టి జియో వైపు మళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.