రిలయన్స్ జియో ఉచిత సేవల దెబ్బకు మిగతా అన్ని టెలికాం సంస్థల మాటెలా ఉన్నా రిలయన్స్ జియో అదినేత ముఖేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్) దారునంగా నష్టపోయింది. పూర్తిగా అప్పులో కూరుకుపోయింది. ఆ అప్పుల్లోంచి బయటపడడమే కాకుండా జియోను దెబ్బకొట్టి మళ్లీ పైకి లేవాలన్న తాపత్రయంతో ఆర్ కామ్ సరికొత్త ప్లాన్లతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
కొత్తవారే టార్గెట్
ఉన్న వినియోగదారులను కాపాడుకోవడంతో పాటు కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ కామ్ తమ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ పై ఏకంగా ఏడాది పాటు డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఎంపికచేసిన పోస్టు పెయిడ్ ప్లాన్లపై 28 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ కొత్త ఆర్ కామ్ ప్లాన్లు ఢిల్లీ, ముంబై, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లోని 4జీ యూజర్లకు అందుబాటులో ఉంటాయి.
వైబ్ సైట్ నుంచి సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే
కాగా ఆర్ కామ్ ప్రకటించిన ఈ కొత్త ఆఫర్లతో 1జీబీ 4జీ డేటా కేవలం రూ.11.1కే అందుబాటులోకి రానుంది. అయితే, ఇక్కడో మెలిక ఉంది. కంపెనీ వెబ్ పోర్టల్ rcom-eshop.com ద్వారా సబ్ స్క్రైబ్ అయినవారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. అంటే పూర్తిగా కొత్తవారికేనని అర్థమవుతోంది.
వెబ్ పోర్టల్ ద్వారా సబ్ స్క్రైబ్ చేసుకున్నవారికి ఈ డిస్కౌంటెడ్ ధరలు 12 నెలల పాటు ఇస్తారు. గరిష్ఠంగా డిస్కౌంట్ విలువ ఏడాదికి రూ.2400.
జియోను పోలిన ప్లాన్లు
మరోవైపు రిలయన్స్ జియో రూ.509 ప్లాన్ కు పోటీగా రూ.499 ప్లాన్ ను ఆర్ కామ్ ఆఫర్ చేస్తోంది. దీనికింద 30జీబీ 3జీ,4జీ,2జీ డేటా, హోమ్ సర్కిల్ లో అపరిమిత వాయిస్ కాల్స్, 3000 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ అందుబాటులో ఉంటున్నాయి. రూ.333 ప్లాన్ ను జియో రూ.309 ప్యాక్ కు పోటీగా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో కూడా 30జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్ రోమింగ్ కాల్స్, 1000 అవుట్ గోయింగ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. అవుట్ గోయింగ్ కాల్స్ పరిమితి దాటితే నిమిషానికి 50 పైసలు చార్జీలు పడతాయి.