మరో రెండు రోజుల్లో రిలయన్స్ ఇండస్ర్టీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. జులై 21న నిర్వహించే ఈ సమావేశంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా ఈ ప్రకటన ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేని గురించి ప్రకటించే అవకాశం ఉంది.. ఎలాంటి ఆఫర్లు ఉండొచ్చన్న విషయంలో అంచనాలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి. అవేంటో చూద్దాం.
రూ.500 ఫోన్
రిలయన్స్ జియో ఒక 4జీ ఫీచర్ ఫోన్ ను రూ.500కే మార్కెట్లో ప్రవేశపెట్టబోతోందన్న ప్రచారం కొద్దికాలంగా సాగుతోంది. దీనికి సంబంధించినవంటూ కొన్ని ఫొటోలు కూడా ఇప్పటికే లీకయ్యాయి. సో... ఈ మీటింగులో దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన ఉండొచ్చు.
మరిన్ని డాటా ప్లాన్లు
రీసెంటుగా జియో తన డాటా ప్లాన్లను సవరించినా ఉచితానికి బాగా అలవాటు పడిన కస్టమర్ల నుంచి పెద్దగా సంతృప్తి కనిపించలేదు. ఈ నేపథ్యంలో తక్కువ డినామినేషన్.. ఎక్కువ ప్రయోజనాలున్న మరిన్ని డాటా ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది.
జియో ఫైబర్
జియో ఫైబర్ ను ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్, జామ్ నగర్, సూరత్, వడోదర వంటి ప్రాంతాల్లో ప్రారంభించడానికి సంబందించిన ప్రకటన రావొచ్చు.