మీ సిమ్ కార్డుకు ఆధార్ కార్డుని అనుసంధానం చేసుకోండి.. మీ దగ్గర్లోని ఔట్ లెట్కు వెళ్లి ఆధార్ కార్డు చూపిస్తే ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది అంటూ మనకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకుంటేనే కదా! కానీ ఇక పట్టించుకోక తప్పదేమో! ఎందుకంటే ఆధార్తో అనుసంధానం చేయని సిమ్ కార్డులు డియాక్టివేషన్ అయ్యే ప్రమాదంలో పడ్డాయి. 2018 ఫిబ్రవరి నాటికి ఆధార్తో అనుసంధానం చేయని సిమ్లను డియాక్టివేట్ చేయడానికి టెలికాం కంపెనీలు సిద్ధం అవుతున్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం..
సిమ్ కార్డులను మస్ట్గా ఆధార్ కార్డులతో లింక్ చేయాలి.. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. దీని వల్ల అసాంఘిక శక్తుల ఆట కట్టించొచ్చనేది సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. ఇటీవలే వచ్చి దుమ్మరేపిన జియో కూడా.. ఆధార్ ద్వారానే సిమ్లను జారీ చేసింది. దీంతో ఆ సిమ్లను వాడే యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ తదితర కంపెనీల కనెక్షన్లు ఉన్న యూజర్లు మస్ట్గా ఆధార్ను సిమ్తో లింక్ చేసుకోవాలని టెలికాం కంపెనీలు సూచిస్తున్నాయి. ఇప్పటికే తమ కస్టమర్లకు పదే పదే సందేశాలు పంపించాయి.
2018 ఫిబ్రవరి తర్వాత కట్..
తమ ఫోన్ నంబర్ను ఆధార్తో లింక్ చేసుకోవాల్సింది కస్టమర్లందరికి పదే పదే సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నామని.. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి దాటితే తాము ఏం చేయలేమని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. సిమ్లు డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని ఆ సంస్థలు చెబుతున్నాయి. వినియోగదారుల దగ్గర నుంచి సేకరించిన డేటాకు ఎలాంటి ముప్పు ఉండదని.. డేటాను ఎంతో సురక్షితంగా ఉంచుతామని ఈ సంస్థలు చెబుతున్నాయి. ఒకవేళ బయటకు వివరాలు వస్తే మూడేళ్ల జైలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం వెంటనే ఆధార్ను మొబైల్ నంబర్తో లింక్ చేసుకోండి.