ఫ్రీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో భారతీయ టెలికం యూజర్ల మనసు దోచిన జియో ఇప్పుడు ఈ సెక్టార్లో దిగ్గజాలైన ఎయిర్టెల్, ఐడియాలతో సై అంటే సై అని పోటీపడుతోంది. ఫ్రీ ఆఫర్లు ముగిసి మూణ్నెల్ల రీఛార్జి ఆఫర్లతో వచ్చినా కూడా జియో టారిఫ్ మార్కెట్లోఉన్న మిగతా సర్వీస్ ప్రొవైడర్ల అందరి కంటే బాగా చౌక. కవరేజి బాగుండడం, కాల్ క్వాలిటీ, నెట్ స్పీడ్ సూపర్గా ఉండడంతో జియో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు టారిఫ్ పెంచి తన స్పీడ్కు తనే బ్రేకులు వేసుకునేలా కనిపిస్తోంది.
ఆల్రెడీ మొదలైంది..
జియో15 నుంచి 20% వరకు పెంచింది
లాస్ట్ వీక్ జియో తన టారిఫ్ను 15 నుంచి 20% వరకు పెంచింది. ఇది ఈ ఒక్క నెలతోనే ఆగదని, ప్రతి నెలా టారిఫ్ పెంచుతూ వెళతారని స్టాక్ బ్రోకరేజి కంపెనీ గోల్డ్మాన్ సాచెస్ అంచనా వేస్తోంది. 2018 జనవరి నాటికి మరోసారి భారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతోంది. 309 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ప్రస్తుతం 49 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నజియో వచ్చే సంవత్సరం దాన్ని 28 రోజులకు తగ్గించే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. అంతేకాదు జియో రీఛార్జి ప్లాన్స్లో బాగా పాపులరయిన, ఎక్కువ మంది వాడుతున్న 399 ప్లాన్ను కూడా రేట్ పెంచబోతుందని చెబుతోంది. 84 రోజులపాటు రోజూ 1జీబీ డేటా, అన్లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ ఇచ్చే ఈ ఓచర్ను ఖరీదును 459 రూపాయలకు పెంచి, ఓవరాల్ ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU)ను పెంచుకోవాలన్నది జియో ప్లాన్ అన్నది గోల్డ్మాన్ సాక్స్ అంచనా.
ఎయిర్టెల్కు లాభం
జియో రేట్ పెంచితే అది ఎక్కువమంది యూజర్లున్న ఎయిర్టెల్కు లాభమని అంచనా వేస్తున్నారు. జియో కూడా ఎయిర్టెల్ రేట్కు దగ్గరకొచ్చేస్తే ఎయిర్టెల్ వైపు యూజర్లు మొగ్గు చూపొచ్చన్నది లెక్క. రేట్ పెంచితే ఆదాయం పెరుగుతుందేమోగానీ కస్టమర్లు లాస్ అవుతారని భావిస్తున్నారు. అందుకే జియో రేట్లు పెంచగానే ఎయిర్టెల్ షేర్ ధర భారీగా పెరిగింది. గత పదేళ్లలో అత్యధిక రేట్ పలికాయి. ఎయిర్టెల్, ఐడియా వంటి మిగిలిన కంపెనీలు కూడా టారిఫ్లు పెంచుతాయా అనేదానిపైనే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది. జియో పెంచింది కదా అని ఇవి కూడా రేట్లు పెంచితే కస్టమర్కు మళ్లీ మోత తప్పదు.